-->

"విశాఖరత్న" శ్రీ బి.వి.బంగార్రాజు

Pages

  • Home
  • Contact
Showing posts with label వ్యాసాలు. Show all posts
Showing posts with label వ్యాసాలు. Show all posts

Wednesday, 11 July 2012

శ్రీ బి.వి.బంగార్రాజు గారి సాహిత్యం-వ్యక్తిత్వం


సాహిత్యం: 
    శ్రీ బి.వి.బంగార్రాజు వృత్తి రీత్యా ఇంజనీర్. సాహిత్యాభిమాని. చదువుకొనే విద్యార్థి దశలోని ఆ సాహిత్య వాతావరణమే బంగార్రాజు గారిని కవిగా చేసింది.  అవధానిగా పేరున్న బులుసు వెంకన్న పరిచయమే బంగార్రజుగారిని కవిగా మలిచింది. ఆ స్పూర్తితోనే ఆశువుగా పద్యాలు చెప్పే అనుభువంతో కాకినాడలో 1999  లో బంగార్రాజు ఐదుగురు పృచ్ఛకులతో పంచావధానం చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాతా చాలా అవధానాలలో  పృచ్ఛకునిగా పాల్గొనడం ప్రారంభించారు. ఇప్పటివరకు 50 అష్టావధానాలలో చందోభాషణ చేసే  పృచ్ఛకునిగా పాల్గొన్నారు. ఇవిగాక శతావధానాలు, సహస్రావధానాల కార్యక్రమాలలో పాల్గొన్నారు.
     చిన్నప్పట్నుంచి సాహిత్యంపట్ల మక్కువ ఎక్కువ వున్నా బంగార్రాజు గారు తన 18 వ యేట "బాల కవితామండలి"అనే సంస్థను స్థాపించారు. తన 20 వ యేట ఓ జమిందారు గారిపై "పంచరత్నాలు"పేరున చక్కని పద్యాలు రాసి బాలకవిగా గుర్తింపు పొందారు బంగార్రాజు గారు. కాకినాడ స్థానిక పత్రికలోనూ, నర్సాపురం నుండి వెలువడే "ఉపాధ్యాయిని " పత్రికలోనూ, ఆంధ్రా పాలిటెక్నిక్ పత్రికలోనూ బంగార్రాజు గారి పలు రచనలు ప్రచురింప బడ్డాయి. "రమ్య గుణ సాంద్ర పట్టాభి రామచంద్ర" అనే మకుటంతో 100 సీస పద్యాలతో తన స్వగ్రామంలోని పట్టాభి దేవునిపై రాసిన శతకాన్ని చదివి బాగుందని మంగమ్మ అనే తెలిసిన ఒక మహిళ మద్రాసు పట్టుకు పోయారు. ఆ తర్వాత ఆ ప్రతి ఆయనకు తిరిగి రాలేదు. ఆ విధంగా మొదటి శతకాన్ని రచించి పోగొట్టుకున్నారు బంగార్రాజు గారు. ఆతర్వాత అప్పుడప్పుడు రాసిన పద్య కవిత్వం చాల ఉంది.సుమారు 120 పద్యాలు ఏలూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నారు రాజుగారు. ఆతర్వాతనుంచి  అప్పుడప్పుడు అలవాటుగా రాసిపెట్టుకున్న శతక పద్యాలను ప్రముఖ సాహితీ వేత్త డా.ద్వా.నా.శాస్త్రి అనుకోకుండా చూడడం జరిగింది.ఆ పద్యాలను చదివి, మెచ్చుకొని పుస్తక రూపంలోకి తీసుకురావాలని బంగార్రాజు గారిని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో ఏప్రిల్ 2001 లో రాజుగారు "మౌనీరాగాలు" పేరుతో పద్యకవితా సంపుటిని ప్రచురించారు. ఇందులో రాజుగారు తన మనుమరాలు మౌనికను సంబోధిస్తూ పద్యాలు చెబుతున్నట్లు "మౌనీ" మకుటంతో 100 కంద పద్యాలతో "మౌనీశతకాన్ని" ఈ సంపుటిలో ప్రచురించడమే గాకుండా, క్రాంతిపథం, ధరణీ విలాసం, మహిళ, పగ-ప్రతీకారం, సభ్యత-సంస్కారం, అమ్మపిలుపు, చైతన్యం,విశ్వయానం, సంకల్పం, మినీకవితలు, జీవాలు-భావాలు,పల్లెలు-భాగ్యాలు,మన విశాఖ శీర్షికలతో 13 పద్య ఖండికలను "మౌనీరాగాలు" అనే పద్య కవితా సంపుటిలోనే ప్రచురించారు. ఈ సంపుటిని తన జీవిత భాగస్వామి సత్యవతి గారికి అంకితమిచ్చారు.
     ఏప్రిల్ 2002 లో "చైతన్యరాగాలు" అనే మరో పద్యకవితా సంపుటిని ప్రచురించారు. ఈ సంపుటిలో 108 ఆటవెలది పద్యాలతో కూడిన "చైతన్య శతకం" ఉంది. ఇదిగాక..."మతమంటే",సీమంతోత్సవ శుభాశీస్సులు, బ్రహ్మరాత అనే శీర్షికలతో కూడిన పద్యఖండికలు, కాన్వెంట్ చదువులు, గురుస్తుతి అనే రెండు గేయాలను రచించారు. ఈ సంపుటిని తనను పెంచి పెద్దచేసిన అమ్మమ్మ "వేంకట నరసమ్మ  " గారికి అంకితమిచ్చారు. ఇవిగాకుండా 29 పద్యాలలో స్వాగతం పేరుతో సంక్షిప్తంగా తన జీవిత చరిత్రను రాసుకున్నారు. వీటిని రాజుగారి సష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా 30 అక్టోబర్ 1998 న ప్రచురించారు. ఇదే సంచికలో "శ్రీ శనగల నరసింహస్వామి 'ఆంధ్రజ్యోతి'  వారపత్రికలో నిర్వహించిన "సమస్యాపూరణం"లోని సమస్యలకు బంగార్రాజు గారు పూరించి పంపగా ప్రచురితమైన వాటిలో కొన్నింటిని ప్రచురించారు. ఇవిగాక "సిద్ద సమాధి యోగ" శీర్షికతో రాసిన 9 పద్యాలను కూడా రాజుగారు ప్రచురించారు. ఇక వివిధ సందర్భాలలో, వివిధ సమావేశాలకై, అతిథులకు, కవులకు ఆశీస్సులు అందిస్తూ రాసిన పద్యాలకు లెక్కే లేదు.  విశాఖపట్నం ఆలిండియా రేడియో కేంద్రంలో ప్రసారమైన "సమస్యాపూరణం" కార్యక్రం నిర్వాహకునిగా ఎందఱో కవుల అభిమానాన్ని చూరగొన్నారు.  
     బంగార్రాజు గారు పద్యకవిత్వమే కాదు; అనువాద రచనలనూ చేపట్టారు.1994 లో "అమృతాహారం", "అంతానీసొంతం" అనే అనువాద రచనలు చేశారు. బంగార్రాజు గారు "ఋషి వాణి  " అనే  తెలుగు మాసపత్రికను 1998 వరకు నిర్వహించారు. ఇవిగాక వివిధ సాహితీ,సాంస్కృతిక సమావేశాలకు అధ్యక్షునిగా,ముఖ్య అతిథిగా,గౌరవ అతిథిగా,ఆత్మీయ అతిథిగా,సన్మాన కర్తగా వ్యవహరించారు. వారు చేస్తున్న సాహితీ సేవకు ఎన్నో సన్మాన సత్కారాలను స్వీకరించారు. ఎన్నో సాహితీ సాంస్కృతిక సంస్థలను వారు ప్రోత్సహించారు. వివిధ సాహితీ,సాంస్కృతిక సంస్థలకు వారు గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. 
     భీమిలిలో ఉద్యోగం చేస్తుండగా కళాభిమానంతో 1963 లో  సమితి ఆవరణలో "ఆరుబయట రంగస్థలం"(ఓపెన్ ఎయిర్ థియోటర్) నిర్మించారు. 1955 లో "అమాయకుడు", 1962 లో "కింకర్తవ్యం" అనే నాటికలు రచించారు బంగార్రాజుగారు. 1963 లో దాసరి గోపాల కృష్ణ  అనే రచయిత రచించిన "చిల్లరకొట్టు చిట్టెమ్మ" అనే నాటికకు   దర్శకత్వం వహించి విజయనగరం లో జరిగిన పరిషత్ పోటీలలో పాల్గొని షీల్డ్ ను గెలుచుకోచ్చారు. 1954 లో డి.వి.నరసరాజు గారు రచించిన "వాపసు"నాటికలో "శటగోపం      "పాత్ర ధరించి నటించారు బంగార్రాజు. శర్మగారి "రాష్ట్రం"నాటికలో హాస్య పాత్రలోనూ, "గుడిగుడి గుంచం"టెలీ సీరియల్ లోనూ, విశాఖవాసుల్లో ఆరోగ్య భద్రత కల్పించే ఉద్దేశంతో విశాఖ నగరాభివృద్ధి సంస్థ  వారు "దాసరి కల్చరల్ అకాడెమీ" సారధ్యంలో నిర్మించిన మరో టెలీ ఫిలిం లోనూ రాజుగారు నటించారు.
     రాజుగారికి సాహితీ సాంస్కృతిక రంగాలపై ఉన్న అభిరుచికొద్దీ, మనుమరాలుని మంచి నర్తకిగా, పెద్ద కుమార్తెని మంచి వీణా వాద్య కళా కారిణిగా తయారుచేశారు, ప్రోత్సహించారు. రాజుగారి  పెద్ద కుమారుడు,. చిన్న కుమార్తె ఇరువురు డాక్టర్ లైనా గేయాలు,వచన కవితలు రాస్తూ సాహితీ రంగంపై వారికున్న మమకారాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరి తండ్రి రాజుగారు వారికి  ప్రేరణగా నిలిచారు.
      మహా సహస్రావధాని డా.గరికపాటి నరసింహారావు, ప్రఖ్యాత విమర్శకులు డా.ద్వా.నా.శాస్త్రి,పండితులు శ్రీ దివాకర్ల రామమూర్తి, శ్రీ పేరాల భరతశర్మ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన కవి శ్రీ బి.వి.బంగార్రాజు.

వ్యక్తిత్వం:
బంగార్రాజు గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు.5 మాసాల ప్రాయంలోనే కలరా వల్ల తల్లిని కోల్పోయిన దురదృష్ట వంతుడు బంగార్రాజు. పెద్దమ్మ పురిటి సమయంలో వైద్య సహాయం లేక మరణించింది. 10 వ యేటనే ఈ సంఘటనలు ఆయనపై ప్రభావాన్ని చూపాయి.. తన్ను ఎలాగైనా డాక్టర్ కావాలనే సంకల్పం కలిగింది గాని నెరవేరలేదు. తన కోరికగానే మిగిలిపోయిన డాక్టర్ చదువును తన కుమారుడు, కుమార్తెల ద్వారా నేరవేర్చుకోవడమే గాక, ఆతర్వాత మనుమరాలు,మనుమడు కూడా డాక్టర్ చదవడానికి పరోక్ష స్ఫూర్తి  బంగార్రాజు గారే! ఐదు మాసాల ప్రాయంలోనే తానూ కోల్పోయిన తన తల్లిగారి జ్ఞాపకార్థం తల్లి స్వగ్రామం నేరేడుమిల్లిలో స్థలం కొని ఆసుపత్రి నిర్మించిన మాతృ భక్తిగల మంచి వ్యక్తిత్వం శ్రీ బి.వి.బంగార్రాజు. తల్లి మరణాంతరం ఇరవై సంవత్సరాలపాటు తనను పెంచి పెద్ద చేసిన అమ్మలాంటి అమ్మమకు తన కావ్య సంపదను ఆమె పాదపద్మాలకు సమర్పించి సత్కరించిన కృతజ్ఞతా భావం తొణికిసలాడే ప్రేమ మూర్తి బి.వి.బంగార్రాజు గారు. బంగార్రాజు గారు సౌమ్యులు,మితభాషి, మృదుభాషి, దృఢ సంకల్పి,దానశీలి,స్నేహశీలి. పరోపకార పరాయణులు. సాహితీ సాంస్కృతిక కళా ఆరాధకులు - ప్రోత్సాహకులు. వారి గూర్చి ఎన్ని చెప్పుకున్న తక్కువే!                                                                               
                      - వ్యాస రచయిత: డా.తలతోటి పృథ్విరాజ్ 
Posted by B.V.Bangar Raju at 18:46 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

Monday, 4 June 2012

మహోన్నతులపై బంగార్రాజు పద్యాలు


     మహోన్నత వ్యక్తులు ఎప్పటికీ ఆదర్శనీయమే!. వారి గూర్చి నేటి తరానికి తెలియజేయడం మన బాధ్యత. నీతి శతకాలలో ఇటువంటి పద్యాలు ఉండతగినవి. చరిత్ర, పురాణాలు,ఇతిహాహాసలోని ఆదర్శనీయమైన, పూజ్యనీయమైన వ్యక్తులను శతక పద్యాలకు వస్తువులుగా చేసుకొని సందేశాత్మక పద్యాలను రచించారు బంగార్రాజు. త్యాగానికి, తండ్రిమాటకి,సత్యానికి,దానగుణానికి ప్రతీకలైన వ్యక్తులను, వారి ప్రత్యేకతలను కవి 
"శిబిచక్రవర్తి త్యాగము,
అభిరాముని పితృవాక్య మందభిరుచియున్,
ప్రభువు హరిశ్చంద్రు నిజము,
విభుకర్ణుని దాన గుణము విలువలు మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని మహనీయుల విలువలను ప్రస్తావిస్తారు బంగార్రాజు గారు. 
     కరుణ,శాంతి,అహింస,మానవ సేవ  మొదలగున సద్గుణాలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి, మరిముఖ్యంగా నేటితరం! అందుకే ~"
" గౌతమ బుద్ధుని కరుణయు,
జాతికి పితయైన గాంధి శాంతి, అహింసల్
మాత థెరిస్సా సేవలు
నీతర మాదర్శములుగ నిలుపుము మౌనీ! "(వీడియోకై క్లిక్ చెయ్యండి) అని మహనీయుల ఈ సుగుణాలను మన మనసులో నిలుపుకొని మసలుకోవాలని కవి ఉద్భోదిస్తారు.
     దేశాన్ని పట్టిపీడించే అంశాలలో మూడాచారాలు ఒకటి.  రాజా రామమోహనరాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలగు సంఘసంస్కర్తలు కొందరు ఇటువంటి భావాలను ప్రజల మనసుల్లోనుంచి తీసివెయ్యడానికి వారి జీవితాన్నే అంకితం చేశారు.  రాకెట్ యుగమని చెప్పుకునే ఈరోజుల్లో కూడా మూడాచారాలను అనుసరించేవారున్నారంటే ఆశ్చర్యమే! . అప్పుడంటే  రామమోహనరాయ్, కందుకూరి వారు ఉన్నారు. మరి అటువంటి వారు నేడేరీ? అందుకే ~
" మూడాచారములెన్నో
పీడించుచు నుండె జనుల వృత్తము నెల్లన్;
రాడే "రాజారాము"డు
లేడొకొ 'వీరేశలింగ'రేడిట మౌనీ! " అని ప్రశ్నిస్తున్నాడు కవి నేటి తరం యువతను. ఈ దేశీయులలో ఉన్న మూడాచారాలను పోగొట్టేందుకు ఒక్కొక్కరు రామమోహనరాయ్, కందుకూరి వారి అవతారమెత్తాలని కవి ఆశ. ఇదే కవి భావం!
     ఈ రకంగా కవి బంగార్రాజు నేటి తరం యువకులకు మహానీయులగూర్చి చెప్పడమే కాదు, వారి ఆదర్శనీయమైన గుణగణాలను పుణికి పుచ్చుకొని దేశం వర్దిల్లడంలో తోడ్పడాలని తన శతకపద్యాలద్వార తెలియజేసారు బంగార్రాజు.

Posted by B.V.Bangar Raju at 01:44 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

Thursday, 31 May 2012

ధ్యాని - బంగార్రాజు


     పద్యకవి శ్రీ బి.వి. బంగార్రాజు తన శతక సాహిత్యంలో "ధ్యాన" మార్గము గూర్చి కొన్ని పద్యాలను రాశారు. మనిషిని చెడువైపునుంచి మంచి వైపుకు మళ్ళించే మహత్తరమైన సాధనంగా ద్యానాన్ని కవి పేర్కొన్నారు. ధ్యానం ఆరోగ్యానికే కాదు సుగుణాలను పొందడానికి కూడా ఒక మార్గం. శరీరంలో ఒక భాగం మనసు. అదికూడా ఒక మాంసపు ముద్దే అని భావించవద్దని కవి అంటారు. మనసు కోతిలా చంచలత్వ లక్షణాలను కలదిగా పేర్కొంటారు.  మనసు కుదురుగా ఉండనప్పుడు, దానిని నిర్లక్ష్యం చేస్తే పెను భూతమై మనల్ని మింగే ప్రమాదం కూడా ఉన్నది కనుక అట్టి స్థితినుంచి రక్షించ గలిగే ధ్యాన మార్గం గూర్చి కవి బంగార్రాజు ~ 
" మనసును మాంసపు ముద్దగ
అనుకొన్నను కుదరదమ్మ అది కోతి సుమా!
పెనుభూతము కాకుండగ
మనవైపుకు తెచ్చు "ధ్యాన"మార్గము మౌనీ! " అని ధ్యాన మార్గాన్ని సూచిస్తారు .
     మనసులో ఏర్పడే దుఖాన్ని పోగొట్టే మందు గూర్చి ~
" మనమున కలిగెడు దుఃఖము
క్షణమున పోగొట్టు మందు కనుగొనె గురువుల్
కనగానదియే 'వర' మీ  
జనకోటికి "ధ్యాన" యోగ సాధన మౌనీ! " అని దుఃఖ బాధను అనుభవించే జీవకోటికి వరమన్నట్లు, దుఖానికి విరుగుడైన మందు అన్నట్లు "ధ్యానాన్ని" కవి పేర్కొన్నారు.
     ధ్యానం చెయ్యడం వల్ల దుఖం పోవడమే కాదు, చంచల స్వభావాన్ని మనిషినుంచి దూరం చెయ్యడమే కాదు, జ్ఞానాన్ని పెంపొందించు కోవచ్చని  ఇలా కవి బంగార్రాజు చెబుతారు.
" ధ్యానము సాధన చేయగ
మానస మందమరు 'స్థిరత' మంచియె నిలచున్;
జ్ఞానము పెంపొందెడు న
ద్దానిని నిత్యమ్ము సలుప ధన్యవు మౌనీ! " 
     ఈ రీతిగా కవి బంగార్రాజు గారి శతకాలలో ధ్యాన స్థితి ద్వారా మనిషి పొందగలిగే ప్రయోజనాలను కూడా ఉపదేశాత్మకగా చెప్పారు. బంగార్రాజు గారి ఆరోగ్య రహస్యాలలో వారు అనుదినం అనుసరించే ఈ "ధ్యానం" కూడా ఒకటి.
Posted by B.V.Bangar Raju at 20:03 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

Wednesday, 30 May 2012

బంగార్రాజు పద్యాలు - ఆహార నియమాలు

ఆధునిక శతక కవులు అనేక నూతన కవితా వస్తువులపై కవిత్వ  రచన చేస్తున్నారు. సెల్ ఫోన్, సెజ్ లు, షేర్ లు మొదలుగున్నవే కాకుండా ఆహార విశేషాలను కవితా వస్తువులుగా తీసుకొని బంగార్రాజు కొన్ని సందేశాత్మక శతక పద్యాలను రచించారు. ఈ ఆధునిక కాలంలో మనం ఊహించని క్రొత్త వస్తువులు వచ్చినట్లే  క్రొత్త ఆహార వస్తువులు, తద్వారా క్రొత్త జబ్బులు. నూడిల్స్ మనం మునుపెరగని ఫాస్ట్ ఫుడ్.   మనం ఇటీవలి కాలం లో తింటున్న చిరుతిండ్లకు బహుమానమన్నట్లు   'గాస్టిక్కు', 'అల్సర్లు' మొదలగు జబ్బులు. అధికంగా కారం, ఉప్పు,మసాలాలు వినియోగించడం వివిధ జబ్బులకు కారణం. కనుక కవి 

" పచ్చి మిర్చి తోడ బజ్జీలె కాకుండ
కూరలందు జేర్చి కూరుకున్న
కడుపు మంటె కాదు, 'గాస్టిక్కు', 'అల్సర్లు'
విడువ వలయు నవ్వి పడవు; చైతు! "అని హితబోధ చేశారు.
     శాకాహారం,మాంసాహారం. నాకు తెలిసి ఈ లోకం లో అధికులు మాంసాహారులే! శాకాహారాన్ని సాత్విక ఆహారంగా చెప్పుకుంటాము. ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం వల్ల అధిక కొవ్వు. తద్వారా గుండె జబ్బులు. బి.పి మొదలగున్నవి. మాంసాహారం చాలదన్నట్లు పొగతాగుతారు. ఇంకొందరు మద్యాన్ని సేవిస్తారు. ఇవన్ని గుండెపై...మనిషి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ~
" మాంస భక్షణమ్ము, మదినిండ "ఒత్తిడి"
పొగను త్రాగు బుద్ధి   ముంచు బ్రతుకు;
గుండె రక్తనాళ కుడ్యాలు కుంచించి
ఆగిపోవు గుండె యంతె; చైతు! " అని కవి బంగార్రాజు తిండిబోతులకు,తాగుబోతులకు జరగబోవు అనర్థాలను పై పద్యం ద్వారా తెలియపరిచారు.
     మితిమీరినది ఏదైనా సరే ప్రమాద కరమే...అది మంచిదే అయినా. అమితాహారము విషతుల్యము. తినడమెంత ముఖ్యమో శరీరానికి వ్యాయామమూ అంతే ముఖ్యం. ప్రతిదినం వ్యాయామం, మంచి ఆలోచనలతో మనసును ఉంచుకొనడం,మితంగా భుజించుట ఇవన్నీ మంచి ఆరోగ్యానికి మార్గాలని~
" ప్రతి దినమును వ్యాయామము,
వ్యతిరేకపు భావములను వదలుట మనమున్,
మితమగు ఆహారమ్మును
బ్రతుకున కారోగ్య మొసగు బాటలు మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి)అని మనందరికీ తన ఆరోగ్య రహస్యాలను తెలియ జేశారు. 1938 లో జన్మించిన వీరు ఇప్పటికి ఆరోగ్యంగా ఉండడానికి ఇవే నియమాలు.
     ఈవిధంగా కవి బంగార్రాజు తన రెండు శతకాలలో మంచి ఆరోగ్యానికి మంచి ఆహార నియమాలను ఎలా అలవార్చుకోవాలో పై పద్యాలద్వార మనకు తెలియ జేశారు.
                          - వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్ 
Posted by B.V.Bangar Raju at 04:13 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

Tuesday, 29 May 2012

చరిత్ర,సంస్కృతి పరిరక్షకుడు బంగార్రాజు


ప్రప్రంచ దేశాలలో కెల్లా భారతదేశ చరిత్ర,సంస్కృతికి విశిష్ట స్థానమున్నది. భిన్న మతాలు,భిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ఇక్కడి ప్రజలు అనుసరిస్తూ భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తూ ఉంటారు. గొప్పదైన మన చరిత్రను, మన సంస్కృతిని మనం గుర్తించాలి,గౌరవించాలి,కాపాడుకోవాలి అని కవి అనేక సందర్భాలలో తన శతక పద్యాలద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
     భారత దేశ సంస్కృతి, మన ధర్మం ప్రపంచ దేశాలలోకెల్లా గొప్పదని ~
" మన సంస్కృతి, మన ధర్మము
ఘనమైనది విశ్వమందు కాదన గలరే!
కనజాలని మౌడ్యముచే
మనముంటిమి తెలివికలిగి మసలుము మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని అంటాడు. ఇటువంటి విలువైన మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి. భావితరాల వారికి తరగని ఆస్తిగా మనం అందించాలనేదే కవి భావం.
     ఈ దేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలూ మొదలగు గొప్ప అంశాలలో ఒకటి పెళ్లి. మన స్త్రీల కట్టూ బొట్టు తో పాటు విదేశీయులను సైతం ఆకర్షించే అంశం పెళ్లి. అంతేకాదు మన దేశీయుల దాంపత్య జీవితం కూడా దృఢమైనది. విదేశీయుల మాదిరి పెళ్ళైన మరుక్షణం విడాకులు తీసుకోవడం ఈదేశంలో కుదరని పని. ఈ దేశంలో మాంగల్యానికి అంత విలువుంది.వీటిని దృష్టిలో పెట్టుకొనే ~
" మన ఆచారపు, పెండిలి
మన దాంపత్యంపు సరళి, మన జీవనముల్
కనమెందు విశ్వమందున
మనసుకు ప్రాధాన్యమిచ్చు మార్గము మౌనీ! "  (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని అంటాడు కవి.
     కన్నూ,మిన్నూ కానక; బాధ్యత   లెరుగక, ఎవరినీ లెక్క చేయక యౌవన కాలంలో కొందరు జీవితాన్ని వృధా చేస్తుంటారు. భర్తగా, తండ్రిగా బాధ్యతలు-వయసూ పైపడ్డాక చేసిన తప్పులకు ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ప్రాణాలు పోయేవరకు నీతివంతమైన నడవడికను కలిగి ఉండడమే ఈ దేశ సంస్కృతి అని చాటుతూ ~
" కన్ను మిన్ను కనక గడిపిన కాలమ్ము
కాల్చు జనుల చివరి కాలమందు;
నీతి వర్తనమ్ము నీదేశ సంస్కృతి;
నిలుపు చివర వరకు నీవు; చైతు!"  అని అంటాడు కవి.
     భారతదేశం అంటే యోగి పుంగవులకు, ఋషులకు నెలవైనది. అన్ని మతముల సమతను కోరుకునే ఈ దేశ సంస్కృత గొప్పదనాన్ని
" భరతదేశ మన్న గురుపరంపర, యోగ
పుంగవులకును, ఋషి పూజ్యులకును
నెలవు; విశ్వమందు వెలసిన మతముల
సమత, గోరుకొనెడి జాతి; చైతు! " (వీడియోకై క్లిక్ చెయ్యండి)  అని కవి బంగార్రాజు కీర్తిస్తాడు.
ఈవిధంగా మనదేశ చరిత్ర, సంస్కృతిని కవి కీర్తిస్తూ ,నేటి తరానికి గుర్తుచేస్తూ తన రెండు శతకాలలో కొన్ని పద్యాలను రచించారు.
                          - వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్ 
Posted by B.V.Bangar Raju at 08:11 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

Monday, 28 May 2012

బంగార్రాజు - స్త్రీవాదం


     పురుషాధిక్య సమాజమే అయినా; నిజానికి ఈ మానవ సమాజంలో "స్త్రీ"ది అత్యున్నత స్థానం అని ప్రతిఒక్కరు ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ప్రేమకీ, త్యాగానికీ, సహనానికీ, శ్రమకు...ఒకటేమిటి!, ఇలా ఎన్నో ఉత్తమ గుణాలకు ప్రతీకగా చెప్పుకోదగిన మహోన్నత వ్యక్తిత్వం గలది స్త్రీ. కాని నేటి పురుషాధిక్య సమాజంలో స్త్రీకి ఏది గౌరవం? ఏది భద్రత? ఏది సమానత్వం?.  ఇటువంటి స్థితిలో తాను స్త్రీల  పక్షాన స్త్రీ పక్షపాతిగా, స్త్రీలపట్ల గౌరవ భావాన్ని కలిగినవానిగా ఉంటూ ఆయా సందర్భాలలో స్త్రీలు తమ మనో ధైర్యాన్ని కోల్పోవద్దని స్త్రీలను బలపరుస్తూ తన శతకాలలో కవి బంగార్రాజు ఎన్నో పద్యాలను రచించారు.
     పురుషాధిక్య సమాజంలో చాలామంది స్త్రీలకు "నేను ఆడదానిని" అనే న్యూనతా భావం ఉంది. నేను అబలను కాదు శబలను అనే భావం కలిగించిన నాడు స్త్రీలకు అన్నిటా విజయమే అని కవి బంగార్రాజు గారు భావించి వారిని ధైర్యపరిచే ప్రయత్నం చేస్తూ  ~
" అబలను నేనని క్రుంగకు;
కబళించును లోక మెల్ల కర్కశరీతిన్;
శబలను నేనని ధైర్యము
నిభిడీ కృతమైన జయము నీయది మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని అంటారు.
     పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎంతో వివక్షతకు గురిఅవుతున్నారు. వివిధ సందర్భాలను మనం పరిశీలించవచ్చు. ఉదా: ఒకేరకమైన పని. ఆ పనికి ఒకే నిర్ణీత వ్యవధిగా గల పని గంటలు. కావి వారు చేసిన శ్రమకు ప్రతిగా ఇచ్చే వేతనంలోనే  వ్యత్యాసం. మగవారికి ఒక కూలీ, ఆడవారికి ఒక కూలీ. ఇంటికి దీపం ఇల్లాలు, ప్రతి మగాడి విజయం వెనుక ఆడదుంటుంది....ఇలాంటి మాటలు ఊరక మాట్లాడుకోదానికే అన్నట్లు లోకంలో స్త్రీల స్థితి. ఆకాశంలో సగం, హక్కుల్లో శూన్యం అన్న రీతిగా ఉన్నది నేటి స్త్రీల స్థితి. ఈ సృష్టిలో ఆదా,మగా ఇద్దరూ సమానమే! అందుకే  ~
" పురుషాధిక్యపు సమాజపు
షరతులు మరి సాగ వలదు శాస్త్రము పేరన్;
తరుణుల రెండవ స్థానము
సరికాదని సమమటంచు చాటుము మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని స్త్రీ పోరాటం చెయ్యాలని వారిపక్షాన కవి నిలబడతాడు.
     తన జీవితానికి ఆధారమైన భర్తని కోల్పోయి దుఃఖించే స్త్రీలకు మనోధైర్యం కలిగించే మాటలు పలికారు కవి. అటువంటి స్త్రీలు దుక్ఖిన్చినంత దుఃఖించినంత మాత్రానా కరిగిపోయే లోకంకాదిది. ఇటువంటి లోకంలో తమకు ఎదురయ్యే కష్టనష్టాలకు వెరవక వారు వాటిని ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగాలని
" పతిపోయిన స్త్రీలందరు
గతిలేదని యేడ్చినంత కరుగుదురె జనుల్;
వెతలకు వెరువక నిలబడి
బ్రతుకును సాగింప తమకు భావ్యము మౌనీ! "  (వీడియోకై క్లిక్ చెయ్యండి)అని అంటారు కవి బంగార్రాజు.
     ఏ మ(మొన)గాడైనా ఏదోఒక విషయంలో మహిళల పట్ల సానుభూతిగా మాట్లాడితే,  అలా సానుభూతిగా మాట్లాడినవారిపైకి కొందరు మగాళ్ళు కొట్లాటకు దిగుతారు. కారణం పురుషాహంకారం వారి నరనరాలలో జీర్ణించుకుపోయి ఉంది. పురుషులు ఇటువంటి భావాన్ని విడనాడి స్త్రీలను గౌరవించాలని స్త్రీలపట్ల సమభావంగల కవి బంగార్రాజు లోకంతీరును
" మహిళ గూర్చి నెవరు మాట్లాడిననుగాని
పురుషలోక మెల్ల మొత్తు నేమొ?
పుణ్య భూమి మనది పురుషహుంకారమ్ము
నరనరాల ప్రాకి నదిర; చైతు! " అని తప్పుపడతారు.
     " ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నడయాడతారు" అని చెప్పుకునే దేశం మనది. కాని ఆచరణలో స్త్రీలను పూజించడం మాని చాలా మంది మొగుళ్ళు  వారి భార్యలకు "బడితపూజ" చేస్తుంటారు. అటువంటి ధోరణిగల మగాళ్ళను కవి నిశితంగా విమర్శిస్తూ
" స్త్రీల కెచట పూజ చేతురో యచ్చట
దేవతాళి వచ్చి తిరుగునంట!
బడిత పూజ చేయు భర్తల యిండ్లలో
తిరుగ రాదొ! మంచి జరుగు: చైతు! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని అంటాడు.
     రోజులు మారాయి. పురుషులతో సమానంగా స్త్రీలూ  అన్ని రంగాలలో తమ శక్తి యుక్తుల్ని ప్రదర్శిస్తున్నారు."మగాడి"ననే అహంకారాన్ని మగవారు విడిఛి స్త్రీలను గుర్తించాలని,గౌరవించాలని ఆశిస్తూ కవి ~.
" స్త్రీ జాతి మేలు కొన్నది;
రోజును మగవారి బూజురోసము లెల్లన్
మేజా బల్లకు వేసిన
రోజా పాలీసు పగిది స్రుక్కెడు మౌనీ! "అని అంటారు.
     వివిధ దేశాలలోని స్త్రీలతో మనదేశం స్త్రీలను పోలిస్తే మనవారు వినయ సంపన్నులు. ఒకప్పటితో పోలిస్తే మెరుగైనా ఇంకా విద్యాపరంగా స్త్రీలు ఎదగాలని, ఎదిగేలా మనం వారిని చైతన్యపరచాలని  కవి   కాంక్షిస్తూ ~
" మన దేశ మహిళలందున
వినయమునకు లోటు లేదు; విద్యాపరమై 
కనజాలము నభివృద్ధిని;
జన జాగృతి సేయు పనిని జరుపుము మౌనీ!  " అని అంటారు.  
ఇవేకాదు; మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని "మహిళా"శీర్షికతో ఖండ పద్యాలను కూడా రాసి "మౌనీ రాగాలు" అనే తన శతకంలో ముద్రించారు బంగార్రాజు. ఈ విధంగా కవి బంగార్రాజు స్త్రీపక్షపతి అని నిరూపించే పద్యాలు ఈ శతకాల్లో చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తిని భర్తగా పొందిన సత్యవతిగారు అదృష్టవంతులు.
                  - వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్   
Posted by B.V.Bangar Raju at 07:08 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

మానవతావాది బంగార్రాజు


     కళ్ళూ,ముక్కు,చెవులూ ఉన్నోళ్ళందరూ ఆకార రీత్య మాత్రమే మనుషులు;గుణాలను బట్టి కాదు!.జాలీ,దయ,కరుణ,సోదరభావం,ప్రేమ మొదలగు మానవీయ గుణాలను కలిగి ఉండడాన్నే"మానవత్వం"అంటారు. ఇటువంటి సుగుణాలు పుష్కలంగా గల కవి బంగార్రాజు గారు.ఈ సమాజం బాగుండాలని, ప్రతిఒక్కరు సుఖంగా,ఆనందంగా,సామరస్యంతో,సోదర భావంతో ఉండాలని కాంక్షించిన కవి. అందుకే ఆయన మానవతావాది. అన్ని వాదాలకంటే మానవతావాదం గొప్పదని గ్రహించిన కవి బంగార్రాజు.
     దేవుడు గుడిలోమాత్రమే ఉండడు!. సకల జీవ రాసుల్లోనూ ఉంటాడు!!. హృదయం లఘ్నం చేసి చూస్తే ప్రతి ప్రాణిలోనూ ఆ దేవుడ్ని చూడవచ్చని కవి అంటాడు. మానవతావాది అయినవాడు ప్రతిఒక్కరిని ఒకటిగానే ప్రేమిస్తాడు. అందుకే ~
" పరమేశుడు గుడి లోపల 
గిరిగీసు కొనుండ డమ్మ ఖేదము బాపన్;
గురినిల్పు హృదయముండిన 
పరమేశుని జూతు వన్ని ప్రాణుల మౌనీ! " అని అంటాడు కవి.
     మనిషి ఎన్నో రంగాల్లో, ఎన్నో విషయాల్లో ఎదిగాడు. సృష్టికి ప్రతిసృష్టి అన్నట్లు ఎన్నో సృష్టించాడు. ఇన్ని చేసినా మానవతా విషయంలోనే మరుగుజ్జుగా ఎదగక నిలిచిపోతున్నాడు. కనుకనే ~
" ఎంతో యెదిగిన మనుజుడు
సుంతైనను మానవతను చూపడె? పొగరా?
పంతాలే జీవితమా?
చింతలు లేనట్టి బ్రతుకు శ్రేయము మౌనీ! " అని అంటారు కవి బంగార్రాజు.
     ప్రేమే దైవం. ఈ లోకంలో ఒకరితో ఒకరు ప్రేమభావంతో మెలిగిన నాడు కక్షలు,కార్పణ్యాలకు తావు లేదు. అందరిలో మానవత ఉన్ననాడు భూమండలమంతా శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. ఈ విషయాన్నే కవి బంగార్రాజు ~
" ప్రేమయె దైవం బిలలో;
ప్రేమయె సుఖ జీవనమ్ము పెన్నిధి సుమ్మీ!
ప్రేమించు మెల్ల వారిని 
భూమండల మంత శాంతి పొందును మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి)అని అంటారు. మన కులం, మన మతం, మన ప్రాంతం...ఇటువంటి బేధ భావాలు చూపక ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని కవి భావం.
     వెన్నలోనే నెయ్యి ఉన్న విధంగా మనిషిలో మానవత్వం ఇమిడి ఉన్నట్లు పరులకు సేవ చేయుచూ జీవించాలని కవి కాంక్షిస్తూ ~
" మానవత్వమిలను మహనీయ మౌనులే
పరుల సేవ చేయు తరుణ మందు;
వెన్నలోన నేయి యున్న విధమ్మున,
మానవత్వ మిమిడి మనుర; చైతు! " అని అంటారు.
     ఇటువంటి ఎన్నో పద్యాలు కవి బంగార్రాజు శతకాలలో "మానవత్వాన్ని" గూర్చి రాసినవి ఉన్నాయి. ఈ పద్యాలన్నీ కవి బంగార్రాజు ను "మానవతావాది"గా నిలిపాయి.
                  - వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్ 
Posted by B.V.Bangar Raju at 02:43 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

Sunday, 27 May 2012

మతైక్యతే బంగార్రాజు అభిమతం


     ఈ అనంతకోటి ప్రపంచంలోనుంచి మానవ జాతి సమూహాలుగా విడిపోయి తెగలుగా,జాతులుగా, మతాలుగా ,కులాలుగా ఏర్పడి సంఘజీవులుగా బ్రతుకుతున్నారు. మనిషి ఏర్పరుచుకున్న కులమతాల పునాదులపై ఆచార వ్యవహారాలూ రూపుతొడిగాయి.  నేడు మానవ జాతిని కబళిస్తున్న ధనముకంటే భయంకరమైనది మతము లేదా కులం. మనుషులు మతాలుగా కులాలుగా విడిపోయారు. కవి బంగార్రాజు కులతత్వం,మత తత్వం లేని సమాజాన్ని కాంక్షిస్తూ అనేక పద్యాలను వారి శతకాలలో రాశారు.
     కొందరు తమ స్వప్రయోజనాల కొరకు కుల తత్వాన్ని, మతతత్వాన్ని రెచ్చగొట్టే విద్వేషాలకు కొందరు మూర్ఖులు ఉపయోగిస్తున్నారు. అటువంటి వారి చర్యలను నిరశిస్తూ ~
" 'మతపిచ్చి'యు, 'కుల పిచ్చి'యు
వెతలను కలిగించె నేడు విపరీతముగా;
గత చరిత మెరిగి కూడా
'కుతికల'వరకెందు కింత క్రోధము మౌనీ! "  (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని అంటారు.పరమతంపై క్రోధాన్ని విడనాడి పరమత సహనాన్ని కలిగి ఉందా;అని ప్రభోదించారు కవి బంగార్రాజు. అంతే కాదు ~
" ద్వేషింపకు పరమతమును,
దూషింపకు కులము పేర దుష్టుం డైనన్,
వేషాలకు విలువివ్వకు,
రోషావేశాల కెపుడు  లొంగకు మౌనీ! "  అని మతపరమైన రోషావేశాలకు పోకుండ మత సహనాన్ని కలిగి ఉండాలని కోరారు కవి.
     ముస్లిం,హిందూ,క్రైస్తవం. మతమేదైనా ఆయామతంలో దేవుళ్ళుగా,ప్రవక్తలుగా పూజింప బడేవారు వారందరూ కరుణామయులే! ఏ ఒక్కరు హింసను అనుసరించమని చెప్పలేదు. అన్ని మతాల పరమార్థం ఒకటేనని గ్రహించని కొందరు వెర్రివాళ్ళు కరుణ, కనికరం లేకుండా మతం పేరుతో మరణ హోమాన్ని సృష్టిస్తున్నారు. ఇవి గమనిచే కవి బంగార్రాజు ~
" 'అల్లా' 'రాముడు' 'జీససు'
కల్లా కపటములు లేని కరుణామయులే;
ఎల్లరి మూలం బొకటని
వెల్లడియగు, తెలియ లేరె? వెర్రా! మౌనీ! "  (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని జనాలలోని మతమనే వెర్రి పోవాలని ఆకామ్క్షిస్తాడు కవి బంగార్రాజు.
     మనుషుల మధ్య పగను రగిలించే మత మౌడ్యాన్నికవి ప్రస్తావిస్తూ
" మతము లందు కలదు మౌడ్యమ్ము కొంతైన
ఇతర మతములన్న నేవగింపు;
భక్త జనులకెల్ల పగ రగిలించుచు,
పరుల జంపు మనుచు పనుచు; చైతు! " అని అంటారు.
     మతమే వినాశానకరమైనదని అనుకుంటే...దానిలోనుంచి పుట్టి, దానికి అనుబంధంగా అన్నట్లు భయోత్పాతం, విద్వంసాల్ని సృష్టించే శక్తులుగా ఏర్పడ్డవి మత విశ్వాసాలు,ఉగ్రవాదం. మత  చాందసం, మూఢ నమ్మకాలు సమాజ పురోభివృద్ధికి ఆటంకాలని గ్రహించమని కవి బంగార్రాజు కోరుతూ ~
"మూఢ నమ్మకములు, మూర్ఖపు ధోరణుల్
ప్రగతి కడ్డమైన బంధనములు;
మధ్య యుగపు నాటి మత చాందసమ్ములు
మనకు వలదు; నేడు వినర, చైతు! "  అని అంటారు.
     మత మౌడ్యం, మూడ నమ్మకాలు వెర్రితలలు వేసిన భూభాగం ఈదేశం. సతీసహగమనం పేరుతో సజీవంగా ఉన్న స్త్రీని అగ్నికి ఆహుతి చేసిన ఒకప్పటి హేయమైన మత దురాగతాలను ప్రస్తావిస్తూ ~
" పతి చనిపోయిన యంతట
'సతి' పేరిట మగువకూడ చావదె మునుపున్;
అతి హేయమైన పద్ధతి
'పతి భక్తి'కి వెర్రితలలు భావ్యమె మౌనీ!" అని అంటారు.     
     మతంలోనుంచి పుట్టిన మరో వినాశనకారి ఉగ్రవాదం. పవిత్ర యుద్ధం పేరుతో, మత తత్వం పేరుతో  సాగించే మారణ హోమాల్ని ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నాము. ఏ మతమూ ఉన్మాదంగా ఉగ్రవాదంతో మారణ హోమాన్ని సృష్టించమని చెప్పలేదు. తుఫానులు,భూకంపాలు రూపాలలో ప్రకృతి కలుగజేసే వినాశానాలకు మానవాళి బలికావడం చూస్తున్నాము. ఇవి చాలవన్నట్లు ఉగ్రవాదం కూడనా?! అని ~
" సృష్టి చేయుచున్న శిక్షలు చాలవా?
ఉగ్రవాదమేల? ఉద్యమమ్ము?
భయపు టంచు లందు ప్రజనుంచు క్రూరత్వ
మే, మతమును నేర్పదిలను చైతు! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అంటాడు.
     కొందరు తాము విశ్వసించే మతమే గొప్పదని, తాము విశ్వసించే  దేవుడే గొప్పవాడని అనుకుంటారు. అంతవరకైతే ఫర్వాలేదు. కాని కొందరు ఎదుటివారి మతాన్ని,దేవుడిని తక్కువచేసి తూలనాడే విధానాన్ని కవి నిరసిస్తూ ~
" నా దేవుడు గొప్పంచును,
నీ దేవుడు తక్కువంచు నిందించుట యీ
భూదేవికి జన్మించిన
సోదరులకు తెలివిలేమి చోద్యము మౌనీ! " అని అంటారు.
    అంతేకాదు."మతమంటే..." శీర్షికతో ఖండ పద్యాలను "చైతన్య రాగాలు" శతకంలో బంగార్రాజు రాశారు.
     ఈ విధంగా శ్రీ బంగార్రాజు  దేశాన్ని పట్టి పీడిస్తున్న మతతత్వాన్ని, కులతత్వాన్ని నిరశిస్తూ మతం పునాదులపై పుట్టిన ఉగ్రవాదాన్ని,మూఢ విశ్వాసాలను ఈ సమాజంలోనుంచి పారదోలాలనే తలంపుతో తన రెండు శతకాలలో కొన్ని అద్భుతమైన పద్యాలను రాశారు.  ఈ పద్యాలను బట్టి మతైక్యతే బంగార్రాజు గారి అభిమతమని చెప్పవచ్చు.
                  - వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్ 
Posted by B.V.Bangar Raju at 05:54 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

Saturday, 26 May 2012

కుళ్ళు రాజకీయ రంగాన్ని ప్రశ్నించిన బంగార్రాజు


     రాజకీయ రంగంపై స్పందించని కవి ఉండదు. రాజకీయ రంగానికి సంబంధించి తన భావాన్ని పంచుకొని కవి ఉండదంటే అతిశయోక్తి కాదు. పద్యమైన,కథైనా,కవితైన..
అది ఏ ప్రక్రియైనా సరే ప్రసిద్ధ కవిత వస్తువై పోయింది నేటి రాజకీయం. నేటి రాజకీయ రంగం గూర్చి, నాయకులగూర్చి,వారి దోపిడీ గూర్చి బంగార్రాజు గారు కూడా పద్య రూపంలో తన స్పందనను తెలియజేసారు.
     మధ్య మధ్యలో కొన్ని ప్రభుత్వాలు అధికారాన్ని చేజిక్కించుకోడానికి, ఆడవాళ్ళ ఓట్లు రాబట్టుకోడానికి మమ్మల్ని గెలిపిస్తే "మద్యపాన నిషేధం" తీసుకొస్తామని హామీలిచ్చి, గెలిచాక కొంతకాలమే ఆ ప్రభుత్వాలు ఆ హామీలకు కట్టుబడి పనిచేశాయి. ఇప్పుడైతే ప్రభుత్వ ఆర్ధిక వనరులలో కీలక భూమిక పోషించేది మద్యమే. సారా మైకంతో సంసారాలు నాశనమవడం, స్త్రీలు సారాకు బానిసలైన భర్తల చేతిలో నరక యాతనను అనుభవించ డాన్ని గమనించిన కవి బంగార్రాజు చింతిస్తూ  ~ 
" సారా త్రాగిన  మైకము
నారీలోకాని కంత నరకము కాదే?
ఈ రాజకీయు అందరు
ఈ రీతిగా నూరకుంట ఎందుకు మౌనీ!" అని ఆవేదన వ్యక్తం చేస్తారు. సారా సమాజానికి చేసే చేటును నాయకులు చూస్తూ మౌనంగా ఉండక సారా మహమ్మారిని శాశ్వతంగా  నిషేదించాలని తన ఆశాభావాన్ని ప్రకటించారు.
     నేడు రాజకీయ నాయకుల అవతారమెత్తే వారందరూ నిజంగా ప్రజాసేవకు కాదు, కోట్లు కూడబెట్టేందుకే! ప్రజలకు సేవ చేయ్యలనుకునేవాడు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టాల్సిన పనిలేదు. ప్రజలు గెలిపిస్తే సేవ చేస్తాడు...లేకపోతే లేదు. అంతే! ప్రజలకు నిజంగా సేవచేయ్యాలనుకునేవాడికి నిజంగా సేవచేయ్యాలనే మనసుంటే చాలు. మరెందు నాయకులకు ఇన్ని కోట్ల ఖర్చు...ఇన్ని అవతారాలు, ఇన్ని ఫీట్లు...పాట్లు అంటే పెట్టిన ఖర్చుకు పదింతలు స్వల్ప వ్యవధిలో రాబట్టుకోడానికి మేలైన మార్గం రాజకీయం. అందుకే~
" "ఎన్నిక" ల గురించి యింతింత ఖర్చులా
ప్రజల సేవ చేయు భాగ్యమునక?
సేవలకొరకైన చిత్తమ్ము చాలదా?
కోట్లు కూడబెట్టు "ఫీట్లు" చైతు! " అని నాయకుల ఫీట్లవెనకున్నదోపిడీ తత్వాన్ని బహిర్గతం చేశారు బంగార్రాజు గారు.
     ప్రజా సేవ పేరుతో చాలా మంది రౌడీలు,గూండాలు,దోపిడీ దారులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. దేశాన్ని ఉద్దరిస్తామని హామీలు ఇచ్చి గెలిచాక ప్రజల నేతిన శటగోపం పెట్టి హైదరాబాదు డిల్లీ లకు  పారిపోతారు. సంపాయించిన అక్రమ సంపాదనను,సంపాయించ బోయే అక్రమ సంపాదనకు రక్షణ కవచంలా ఉపయోగపడేదే రాజకీయమని గ్రహించి చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ ఆలోచనలతోనే~
" జనుల నెత్తిపైన శటగోపములు పెట్టి,
బోర విరుచు కొనెడు నేరగాండ్రు
రాజకీయమందు రంగ ప్రవేశమ్ము,
సొమ్ము భద్రమునకు సుమ్ము; చైతు!" అని రాజకీయం గుట్టు విప్పారు కవి బంగార్రాజు.
     దేశమేమై పోతుందనే బాధ నాయకుల్లో లేదు, అధికారులలో లేదు. అంతకు మించి ప్రజల్లో లేదు. తవ్వే కొద్ది బయటపడే కుంభ కోణాలు. దేశాన్ని రక్షించాల్సిన వారు అలక్ష్యం చేస్తూ దేశ ద్రోహం చేస్తున్నారు. కనుకనే ఇది చూస్తూ సహించలేని కవి బంగార్రాజు~
" దేశ భక్తి చూడు 'తెహల్క' టేపులో
చిక్కి శల్య మయ్యె శిరము వంచి
రక్ష సేయు వారె లక్ష్యమ్ము విడనాడ
దేశమేమగు నొకొ! తెలియు; చైతు! " అని అంటారు.
     కోతలు కోసే నాయకులు,శుష్క వాగ్దానాలను చేసే నాయకులు తప్పించి నీతికి ప్రతీకగా నిలిచే నాయకు డొక్కడు కూడా లేడు నేడు! పదవికోసం ఏమి చెయ్యడానికైనా వెనుకాడని నాయకులే నేడు. పదివి లేకుంటే క్షణం క్షణం ఛస్తూ బ్రతుకుతున్నట్లు ఉంటారు నేటి నాయకులు. ఇటువంటి నాయకుల స్వభావాన్ని గమనించే  ~
" నీతి కొరకు చచ్చు నేత యొక్కడు లేడు;
ప్రాణ మిత్తు ననును పదవియన్న;
పదవి లేదటన్న పలుకులే వికటించు;
విలువలన్నిగాలి గలిసె; చైతు! " అని కవి గంగార్రాజు అన్నారు.
     గట్టున మెయ్యాల్సిన  ఆవు చేలోపడి మేస్తుంటే, దాని దూడ గట్టున మేస్తుందా? అన్న చందాన దోపిడీ నాయకుల అండతో అధికారులు రెచ్చిపోయి దోపిడీకి పాల్పడుతున్నారు నిర్భయంగా. "ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అని ఆత్రేయ అన్న మాటలకు ప్రతినిధులై నిల్చున్నారు నేటి నాయకులు. అవినీతిని అంతమొందిస్తామంటూ మూడు అవినీతులు, ఆరు ఆక్రమాలు గా వర్తిల్లు తున్నారు నేటి నేతలు. అందుకే  ~
" నీతి నిలుపుమనుచు నేతలు వల్లించి,
'స్కాము'లందు తామె స్వాములగుట,
ఆవు చేను మేయ, నది చూచుచును దూడ
గట్టు నెట్టు లుండ గలదు? చైతు! " అని కవి స్కాముల స్వాముల నిజరూపాన్ని బట్ట బయలుచేశారు.
     అసలు ప్రభుత్వమంటే ఏమిటి? నాయకుడంటే ఎవరు? ప్రజలు ఓట్లేసి గెలిపించి ఒకడ్ని నాయకుడ్ని చేస్తే , అలా గెలిచిన నాయకులు(ప్రభుత్వం) ప్రజా ధనాన్ని లూటీ చేస్తుంది. నాయకులు మనకు సేవచేయ్యల్సింది పోయి మనపై పెత్తనం చేస్తున్నారు. అధికారాన్ని ప్రదర్శిస్తుంటారు. అందుకే ప్రజలను ఆలోచించి
" ప్రభుత యెవరి దయ్య "ప్రజలెన్ను కొన్నది"
హింస రేపుటెల్ల  నెవరి కొరకు?
ఆస్తి తగులబెట్ట నదినీకు చెందదా?
ఎరుక నేర్పు ప్రజకు సరిగ;చైతు! " అని ప్రభుత్వాన్ని ప్రశ్నించ మంటున్నాడు కవి బంగార్రాజు.
     గెలిచిన నాయకులు ప్రజా ధనాన్ని దోచుకొని తినడమే కాదు, రకరకాల పేర్లతో పన్నులు విధించి పేదల నడ్డి విరుస్తుంటారు గెలిపించిన పాపానికి. కుంభకోణాలు చెయ్యకుండా, అవినీతికి నాయకులు పాల్పడకుండా ఉంటే పన్నులు వెయ్యాల్సిన పరిస్థితి ఉండదుకదా? స్వదేశంలో దోచుకొని విదేశాలలో దాచుకున్న నల్ల ధనాన్ని తెస్తే ఈ పన్ను పోటులు ఉండవుకదా! అందుకే ~
" పేదవాని నడుము పెళుసుగా నుండును;
విరిగి పోవు "పన్ను"వేయగానె;
స్కాములందు సొమ్ము సర్దుకు పోకున్న
బక్క వాని కేల పన్ను? చైతు! " అని అంటారు కవి బంగార్రాజు. కనుక స్వార్థమే పరమావధిగా రాజకీయాలలోకి వచ్చేవారు స్వార్థాన్ని విడనాడి ప్రజలకు ఆదర్శ ప్రాయముగా నిలవాలని కోరుతూ ~
" రాజకీయ మందు రగిలిన స్వార్థమ్ము
అన్ని రంగములను నావహించే;
ప్రభుత మార్గమిపుడు ప్రజల కాదర్శమ్ము
ప్రభుత కంచే మేసె;పట్టు; చైతు! " అని అంటారు బంగార్రాజు.
      దేశ పాలకులు యువతను నైరాశ్యంలోకి నేట్టివేస్తున్నారు.ఉద్యోగ, ఉపాది, రాజకీయ అవకాశాలు యువతకు కల్పించడం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. భవిష్యత్ అంధకార మయంగా ఉన్న యువతను ఉద్ధరించాలి,మేల్కొల్పాలి అని కవి బి.వి.బంగార్రాజు ~  
" యువతను నైరాశ్యములో
పవళింపగ జేసె దేశ పాలక గణముల్;
భవితవ్యము చీకటియా?
యువతను మేల్కొలుప నెంత యోగ్యము మౌనీ! " అని అంటారు.
     ఈ విధంగా బంగార్రాజు తన రెండు శతకాలలో రాజకీయ రంగానికి సంబంధించిన తన భావాలను తన పద్యాలలో వెలువరించారు. మంచి నాయకుల పాలనతో దేశం వర్ధిల్లాలని కోరుకున్నారు.
                  - వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్ 
Posted by B.V.Bangar Raju at 19:47 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

బంగారు పద్యాల బంగార్రాజు


- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్ 

Posted by B.V.Bangar Raju at 10:53 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

అమ్మ ప్రేమ ప్రతిబింబం బంగార్రాజు


     పద్య ప్రక్రియ ప్రాచీనమైనదైనా బంగార్రాజు స్వీకరించిన కవితా వస్తువులు ఆధునికం...వైవిధ్యమైనవి  కూడా. సంప్రదాయ కవితా రచనా విధానాన్ని అనుసరించి బంగార్రాజు గారు తన రెండు శతకాలను శ్రీకారంతోనే మొదలుపెట్టారు. ఇష్ట దైవ స్తోత్రం తో కూడిన శ్రీకార పద్యాల తర్వాత ఇలలో దైవమైన "అమ్మ" పదం ప్రారంభంతోనే రెండు శతకాలలో పద్యాల్ని రాశారు. ఈ లోకంలో కనిపించే దైవం...మనలను కని పెంచే  దైవం "అమ్మ". మానవులమైన మనలను సృష్టించింది బ్రహ్మో,,,కాదో ఉహా జనితమైన ఆలోచన! మన మత విశ్వాసం!!.  కాని మనకు జన్మనిచ్చి అందమైన ఈ లోకాన్ని చూసేందుకు మూలం...సృష్టి కర్త "అమ్మే".  ఆమే మన జన్మకు "బ్రహ్మ" అందుకే~
" అమ్మను మించిన దైవము 
ఇమ్మహి లేదదియె నిజము ఏమర కెపుడున్ 
బమ్మయ్య ఏమి చేసెనొ
అమ్మేగా నిన్ను కన్న దవనిని మౌనీ! " అని కీర్తించారు తన చిన్ననాడే తల్లిని కోల్పోయి తల్లి ప్రేమకు దూరమైనా బంగార్రాజు.
     ఈ లోకంలో మనం కొందరిని, కొన్నింటిని  పరమ పవిత్రమైనవిగా, గౌరవ నీయమైనవిగా, ప్రత్యేకమైనవిగా భావిస్తాము. మన జన్మకు ఆధ్యుడైన" తండ్రి",  దైవంతో సమానమైన "గురువు", కోవెలలాంటి "బడి" పూజ్యనీయుడు "అతిథి" అని చెబుతూ ఆది దేవతగా "అమ్మ"ను భావించాలని
" 'అమ్మ' జన్మనిచ్చి యాది దేవతయయ్యే,
'అయ్య'కూడ జన్మ కాద్యుడయ్యె,
'గురువు' దైవ మయ్యె కోవెల బడియయ్యె 
'అతిథి' పూజనీయుడయ్యె; చైతు! "  అని కవి శ్రీ బంగార్రాజు అంటారు. వీటన్నింటిలోకెల్లా ప్రతి ఒక్కరు మొదట గౌరవించాల్సిన మహోన్నతమైన వారు "తల్లిదండ్రులు". అందుకే~
" అమ్మ-నాన్నకన్ననారాధ్యు లెవరయ్య?
ఉపిరుండు వరకు కాపుకాచి,
నీదు వృద్ధి కొరకు నిరతమ్ము తపియించు,
త్యాగ శీలురయ్య; తలపు; చైతు! "  అని అంటారు బంగార్రాజు.
     మనం ప్రయోజకులైతే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మించి ఈ లోకంలో సంతోషించే వారు మరొకరు ఉండరు. అందుకే~
" కన్నవారి కలలు వన్నెలీనును గాదె
నిన్ను నీవు తెలిసి కొన్ననాడు;
కన్నవారి ఋణము కాసంత తీర్చిన,
ధన్యమగును జన్మ; తలపు చైతు! " అని కన్నవారి ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకోమని ఉద్భోదిస్తాడు కవి. 
     ఇవేకాదు, "మౌనీ రాగాలు" శతకము చివరిలో  "అమ్మ పిలుపు" శీర్షికతో  ఖండ పద్యాలను రాశారు. తల్లి లేనివారికే తల్లి విలువ తెలుస్తుంది అని అంటారు.ఇదు మాసాల వయసులోనే తల్లిని కోల్పోయినా, జన్మనిచ్చిన అమ్మ ప్రేమను చవిచూసే అదృష్టానికి నోచుకోక పొయినా,  అమ్మమ్మ "వెంకట నరసమ్మ" ప్రేమాప్యాయతలతో ఇరవై సంవత్సరాలు ఎంతో ప్రేమతో   శ్రీ బంగార్రాజు పెదిగి  అమ్మ విలువను గ్రహించి ధన్యులయ్యారు. అందుకే తన "చైతన్య రాగాలు"శతకాన్ని తల్లికి, పెంచిన తల్లికి అంకితమిచ్చి ధన్యుడయ్యాడు.   
                  - వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్ 
Posted by B.V.Bangar Raju at 09:55 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

నీతి కోవిదులు బంగార్రాజు



     తెలుగు సాహిత్యంలో శాఖోప శాఖలుగా వికాసము పొందిన కావ్య ప్రక్రియల్లో శతకము ఒకటి. అందులోనూ  తెలుగు సంప్రదాయ కవితా రూపాల్లో శతక సాహిత్యానికి ఒక విశిష్ట స్థానం ఉంది. శతక ప్రక్రియల్లో ఏ పద్యానికి   ఆ   పద్యం  స్వతంత్రంగా  ఉంటుంది.ఒకో పద్యాన్ని ఒకో వస్తువుతో నీతి దాయకంగా రాసే అవకాశం శతక ప్రక్రియలో ఉంది. బంగార్రాజు గారి శతక పద్యాలలో ఎంతో వస్తు వైవిధ్యం ఉంది. ఆధునికమైన వస్తువులను తన కవితా వస్తువులుగా తీసుకొని భావాన్ని  చాలా సరళంగా చెప్పారని గమనించవచ్చు.
     శ్రమని నమ్ముకొని పనిచేసేవారే జీవితంలో మంచి ఫలితాలను సాధిస్తారని కవి అంటాడు. పనిపట్ల మనసును లగ్నం చేసినవాడే, పనిని దైవంగా భావించేవాడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని
" పనియే దైవం బిలలో 
పనిచేయుట పూజయగును పరమాత్మునకున్ ;
ఘనులందరు పనిలోనే
మనసును లగ్నమ్ము చేసి మనెదరు మౌనీ! " అని అంటారు.
     జ్ఞాని యైనవాడు తన జీవితానికి,తద్వారా సమాజానికి ఉపయోగపడే పని చేస్తూ బ్రతకాలి. ప్రతి మనిషికి ఎప్పుడోకప్పుడు మరణం తప్పదు.ఎవడు ఎప్పుడు పనిచెయ్యక సోమరిగా ఉంటాడో వాడు ఆ ఆ క్షణమే మరణించిన వాడితో సమానం! అందుకే ~
" మనిషి మరణము తథ్యము;
పనిచేయుచు నుండవలయు బ్రతికిన నాళ్లన్
పనిమానుట యన మరణము
కనుకనె మని మానతగదు జ్ఞానికి మౌనీ! " అని కవి శ్రీ బంగార్రాజు అంటాడు.
     మనిషి ఆశా జీవి . ఆశే ఆక్సిజన్ గా మనుషులు బ్రతుకుతుంటారు. ఆశ ఉండాలిగాని  అత్యాశ ఉండకూడదు.పని చెయ్యలిగాని శక్తికి మించిన పని చెయ్య కూడదు. అలా చేస్తే ఒకో సారి అనర్థాలకు దారితీస్తుంది. ఈ సూక్ష్మమైన వ్యత్యాసాన్ని గమనించి, సత్యాన్ని గ్రహించి ప్రతిఒక్కరు జీవించాలని కవి బంగార్రాజు కోరుకుంటూ~
" ఆశతోడనుండు టవనిలో  సహజమ్ము;
అతిగ నాశపడిన బ్రతుకు చెడును;
శక్తి నరసి పనుల జరుపుట ధర్మమ్ము
మోయలేని పనికి పోకు; చైతు! " అని అంటారు.
     "మానవ సేవే మాధవ సేవ" అని నానుడి. ఇతరులకు సేవ చెయ్యడము సాక్షాత్తు ఆ భగవంతుడ్ని పూజించడంతో సమానం. కనుకనే పరుల సేవలో మనలను తరించమంటూ~
" పరులకు సేవలు చేయుట,
పరమాత్ముని పూజయగును పరికింపంగా;
కరుణామయు లీ మాటనె
తరియింపగ చెప్పినారు తలపుము మౌనీ! " అని ఉపదేశిస్తారు కవి శ్రీ బంగార్రాజు.
     "పెద్దవారి మాట చద్ది మూట" అని సామెత. కాని ఇప్పుడు ఈ లోకంలో ఎంతమంది పెద్దవారి మాటలకు విలువిస్తున్నారు? హద్దులు, ఎల్లలు లేని జీవితాన్ని కోరుకునే నేటి యువతకు స్వేచ్ఛ ఎక్కువైనా చెడిపోతారని
" పెద్ద వారి మాట చద్ది మూట" యనిరి;
పెద్దలన్న నిపుడు పెదవి విరుపు;
హద్దులన్న వారి కది యిష్ట ముండదే!
స్వేచ్ఛ యెక్కువైన చెడుటె; చైతు! " అని అంటాడు కవి శ్రీ బంగార్రాజు.
     ఈ విధంగా బంగార్రాజు గారు తన రెండు శతకాలలో చాలా నీతి పద్యాలను సరళ శైలిలో చెప్పారు.రాజుగారి పద్యాలను గమనిస్తే నీతి కోవిదులు బంగార్రాజు అని చెప్పుకోవచ్చు.
                  - వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్ 
Posted by B.V.Bangar Raju at 00:26 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

Thursday, 24 May 2012

ధరణీ విలాపం

గీ.సహన శీలమ్ము శాంతికి సాక్షియైన
   తల్లి భూదేవి మదిలోన తల్లడిల్లి,
   వెల్లడించెను 'బ్రహ్మ'తో వివరణముగ
   తనయులైనట్టి నరజాతి దాష్టికముల


గీ.విశ్వమందున  గ్రహముల వెట్టివైన
   ప్రాణి కోటులు నాపైనె బ్రతుక గలవు;
  నీరు, సస్యము, నిక్షిప్త సారములను
  ఇచ్చి జీవింప జేతునె జీవినైన


గీ.లక్షలాదిగా జీవాలు లక్షణముగ 
   జీవనమ్మును సాగింప,చెనటులైన
   నరులు మాత్రము నన్నేమి సరకు గనక,
   కాలు దువ్వుచున్నారు నేల విడిచి


గీ.జన్మనిచ్చిన పితరుల జంపువారు;
   పాలు త్రాగిన రొమ్మునే పగుల దీయు;
   ఏరు దాటించు తెప్పనే యీడ్చువారు,
   నరులు కాకుండా వేరు కా నంగ రాదు


ఉ.నూకలు చెల్లనో యనగ నూరక నుండ రదేమి చిత్రమో!
   ఆకలి తీరదీ ధరణి నంతను పొట్టను పెట్టుకున్న నున్;
   ఈ కలికాలమే నరుల నింతకు పాల్పడ జేయుచుండేగా?
   నాకిక నోర్పు పోయినది;నా పలుకుల్ మరి పార్థు నస్త్రముల్ 
Posted by B.V.Bangar Raju at 01:09 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు

Tuesday, 22 May 2012

బంగారు మనసు బంగార్రాజు



     మనిషి మాటకు,నడవడికకు, ఉన్నత మానవ లక్షణాలకు మూలమైనది మనసు. మనసు మల్లెపువ్వు లాంటిది. మంచి అనే పాదిని చేసి విచక్షణ అనే నీరు పోస్తూ పెంచితే విజ్ఞానంతో వికసించి పరిమళిస్తుంది మల్లెలా మనసు. లోకంలో జరిగే అనేక దుర్మార్గాలకు, అరాచకాలకు కారకులైన వారి మనః ప్రవృత్తే వీటన్నింటికి కారణం. అందరూ మంచి మనసుకలిగి అందరూ ఆనందంగా  ఉండాలన్నదే బంగార్రాజుగారి ఆలోచన.తెలుగు సినిమా పాటల్లో "మనసు"ను అనేక కోణాల్లో నిర్వచించి, వివరించి "మనసుకవి"గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కవి ఆచార్య ఆత్రేయ. ఆత్రేయ గారి మాదిరిగానే మనసుతత్త్వాన్ని పసిగట్టిన బంగార్రాజు గారు
"అదిమి పెట్ట నెంచ నటకెక్కి కూర్చుండు
బుజ్జగించు కొలది బుసలు కొట్టు;
లెక్క చేయకున్నచక్కగా దరిజేరు,
మనసు, చంచలమ్ము వినవె; చైతు! " అని చంచలమైన మనసును గూర్చి చెప్పి, అలాంటి చంచల మనసుపట్ల అందరూ జాగ్రత్త వహిస్తూ స్థిమిత గుణాన్ని,స్థిరమైన మనసునుగా మన మనసును మలుచుకోడానికి కవి పై పద్యాని రాశారు.
     చంచాలమనసును స్థిరమైన...స్థిమితమైన మనసుగా మార్చుకోడానికి అనేకులు ఆయామార్గాలను అనుసరిస్తారు. కొందరు ధ్యానం చేస్తుంటారు. మరికొందరు దైవ ప్రార్థన చేస్తుంటారు. ఎన్ని చేసిన అంతిమ ప్రయోజనం, లక్ష్యం ఏమై ఉండాలంటే పిచ్చి ఆలోచనలకు అనుగుణంగా కాక మంచి వైపు మనిషిని నడిపించ గలిగే స్థిరమైన మనసును పొందాలని
"ధ్యానమైన గాని, దైవ ప్రార్థన గాని,
మనసు మంచి వైపు మరలు కొరకె;
పిచ్చి ఊహలందు విహరింప బోకుండ
స్థిరత కలుగ చేయు వరము; చైతు!" అని అంటారు.
     మురికంటకుండా వస్త్రాలను ఎలా కాపాడుకుంటామో...మనసునుకూడా అలా  రక్షించుకోవాలి!.మనసు మంచిదైన వారికి లోకంలో అంత మంచే కనిపిస్తుంది. చెడ్డవారికి చెడ్డగానే కనిపిస్తుంది. దృష్టి కోణాన్ని బట్టి లోకాన్ని కనిపిస్తుంది, అర్థం చేసుకుంటారు. మలినం లేని మనసు ఆ మనిషిని మంచివైపు మహోన్నత శిఖరాలవైపు నడిపిస్తుంది. కనుక
"మనసు మంచిదైన మంచి యే కనిపించు;
మలినమైన మనసు తెలివి దప్పు;
తెలివి కలుగ మనసు మలినమ్ము తొలగును;
మంచి వైపు తాను మళ్ళు; చైతు! " అని అంటారు. 

     ఆరోగ్య విషయంలో శారీరక వ్యాయామంతో జాగ్రత పడేకంటే ముఖ్యంగా మనసును నిర్మలంగా ఉంచుకుంటేనే ఆరోగ్యం చక్కగా ఉంటుందని గ్రహించాలి.మనసుకు మలినం అంటకుండా పవిత్రంగా ఉంచుకుంటే ఎదుటివారి గుణము ఎలాఉన్నా మన మనసు మంచిగా ఉంటుందని ~  
" మనసు పొరలలోన మర్మమ్ము లేకుండ
మసలి చూడు నీకు మంచి జరుగు;
ఎదుటి వాని గుణము దెట్లుండగానిమ్ము   ,
నీదు మదిని మంచి నిలుపు ; చైతు! " అని అంటారు.
     గుణగణాలు  మనసుపై  ప్రభావాన్ని చూపుతాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. మంచి గుణాలు మంచి ప్రభావాన్ని, దుర్గుణాలు దుష్ప్రభావాన్ని మనసుపై కలిగిస్తాయి. శాంత గుణం ప్రతిఒక్కరు అలవార్చుకోవాల్సిన గుణం. ఇటువంటి గుణాలు అలవరచుకోవాలని కవి ~
" శాంత పడిన మనసు స్పందించు చక్కగా
వెలితి పడ్డ మనసు కలత జెందు;
తొట్రు పాటులోన దొర్లులే తప్పులు;
స్థిరత కలిగి పనులు చేయు: చైతు! " అని అంటారు.
     ఈ విధంగా కవి బంగార్రాజు తన శతకాలలో మనసు లక్షణాలను, మనస్తత్వాన్ని వివరించి మంచి మనసు అందరూ కలిగుందాలని ప్రబోధించారు బంగారు మనసు బంగార్రాజు.
                  - వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్ 
Posted by B.V.Bangar Raju at 00:24 0 comments
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: వ్యాసాలు
Older Posts Home
Subscribe to: Posts (Atom)

CLICK ON THIS IMAGE

  • బి.వి.బంగార్రాజు శతక పద్యాలు ప్లేలిస్టు

    Labels

    • News with photos (4)
    • పద్యాలు(వీడియో) (29)
    • ఫొటోస్ (12)
    • వీడియోలు (1)
    • వ్యాసాలు (15)
    • స్లయిడ్ షో లు (5)

    Total Pageviews

    Popular Posts

    • ఇండియన్ హైకూ క్లబ్ ఉగాది పురస్కార సభలో శ్రీ బంగార్రాజు
    • శ్రీ బి.వి.బంగార్రాజు గారి సాహిత్యం-వ్యక్తిత్వం
      సాహిత్యం:      శ్రీ బి.వి.బంగార్రాజు వృత్తి రీత్యా ఇంజనీర్. సాహిత్యాభిమాని. చదువుకొనే విద్యార్థి దశలోని ఆ సాహిత్య వాతావరణమే  బంగార్రాజు  గ...
    • ఎంపిక చేసిన బంగార్రాజు గారి శతక పద్యాలు
      తెలుగు సాహిత్యంలో పద్యానికో విశిష్ట స్థానం ఉంది. ఇంకా చెప్పాలంటే తెలుగు సాహిత్యానికే గుర్తింపు తెచ్చిన కవితా రూపం పద్యం. పద్యాన్ని ఇష్టపడని...
    • LIFE SKETCH OF Sri B.V.BANGARRAJU Video by D TALATHOTI PRITHVI RAJ
      శ్రీమతి,శ్రీ బంగార్రాజు గారు!  మీ బెంగుళూరు టూర్ చక్కగా ముగించుకొని క్షేమంగా విశాఖకు తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ...~ డా.తలతోటి పృథ్వి రాజ...
    • స్నేహం గూర్చి బంగార్రాజు గారి పద్యం
    • B.V.Bangarraju News Clips (వివిధ పత్రికల్లో శ్రీ బి.వి.బంగార్రాజు గారి గూర్చి...)
    • Sri B.V.Bangarraju gaari Shaahithya Samaalochana Programme
      ఇండియన్ హైకూ క్లబ్ సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో 22 జూలై 2012 న నిర్వహింపబడిన "శ్రీ బి.వి.బంగార్రాజు గారి శతక పద్య పటన  పోటీకి అన్...
    • విశాఖపట్నంపై బంగార్రాజు గారి పద్యం
      mana vishakha 
    • బంగార్రాజు పద్యాలు - ఆహార నియమాలు
      ఆధునిక శతక కవులు అనేక నూతన కవితా వస్తువులపై కవిత్వ  రచన చేస్తున్నారు.  సెల్ ఫోన్ , సెజ్ లు, షేర్ లు మొదలుగున్నవే కాకుండా ఆహార విశేషాలను కవిత...
    • NATYAMAYURI IDERAPALLI MOUNIKA

    చైతన్య రాగాలు శతక పద్యాలు

    శ్రీ బి.వి. బంగార్రాజు గారు రచించి పద్యాలు



    అదిమి పెట్ట నెంచ నటకెక్కి కూర్చుండు
    బుజ్జగించు కొలది బుసలు కొట్టు;
    లెక్క చేయకున్నచక్కగా దరిజేరు,
    మనసు, చంచలమ్ము వినవె; చైతు!


    అడ్డ దారులందు నక్రమార్జన చేయ
    ప్రాకులాడుచుండు పాడుబుద్ధి;
    చక్కనైన దారి సాగనెంచెదవేని,
    సజ్జనాళి మైత్రి సలుపు; చైతు!


    అమ్మ-నాన్నకన్ననారాధ్యు లెవరయ్య?
    ఉపిరుండు వరకు కాపుకాచి,
    నీదు వృద్ధి కొరకు నిరతమ్ము తపియించు,
    త్యాగ శీలురయ్య; తలపు; చైతు!


    ఆశతోడనుండు టవనిలో సహజమ్ము;
    అతిగ నాశపడిన బ్రతుకు చెడును;
    శక్తి నరసి పనుల జరుపుట ధర్మమ్ము
    మోయలేని పనికి పోకు; చైతు!



    ఆత్మ తృప్తి మించు నైశ్వర్య మున్నదే?
    సహన పరుని గెలుచు శక్తి గలదె?
    పరహితమ్ము కన్న పరమార్థ మేముండె?
    నిజముకన్న నేది నిలుచు? చైతు!


    ఊర కుక్కవోలె నూరెల్ల తిరుగుట
    భూమి భారమౌను పుట్ట చేటు;
    పరుల సేవ మాట భగవంతు డెరుగులే!
    పరుల కెపుడు కాకు బరువు; చైతు!



    ఎన్ని నీతులైన నెదుటి వానికె గాని,
    తనకు కూడ నంచు తలపడసలు;
    నీకు చెప్పుచున్న నీతులు సకలమ్ము
    చెప్పు నాకు కూడ చెందు; చైతు!



    గుడుల చుట్టు తిరిగి, గుంజీలు తీసిన
    కడుపు పండు మాట కల్ల గాదె?
    రావి చెట్టు కాదు, రక్ష రేకులు కాదు,
    లోప మెరుగ కలుగు పాప; చైతు!



    చెడ్డవారి తోడ స్నేహమ్ము మనకేల?
    దొడ్డ గుణము లెల్ల తొలగిపోవు;
    మంచివారి తోడ మసలిన చాలు లే,
    తెలియకుండ చెడుగు తొలగు; చైతు!



    ధనము ధాన్యముండి దాతృత్వమే లేక
    కూడబెట్టు వాడు కూళయగును;
    పైకిపోవు వేళ పడి వెంట రావు లే!
    దాన గుణము తోడ దనరు; చైతు!



    ధ్యానమైన గాని, దైవ ప్రార్థన గాని,
    మనసు మంచి వైపు మరలు కొరకె;
    పిచ్చి యూహలందు విహరింప బోకుండ
    స్థిరత కలుగ చేయు వరము; చైతు!



    నీతి కొరకు చచ్చు నేత యొక్కడు లేడు;
    ప్రాణ మిత్తు ననును పదవియన్న;
    పదవి లేదటన్న పలుకులే వికటించు;
    విలువలన్నిగాలి గలిసె; చైతు!



    నీతికొరకు నెవరు నిలిచినా ధైర్యాన
    పాతి పెడుదురతని పట్టుబట్టి
    నీతిలోన పుట్టి నీతిని నిలబెట్టు
    జాతి మనది; కృషిని సలుపు; చైతు!



    జనన మంది నరుడు చనిపోవు లోపున
    జ్ఞానమబ్బు నెపుడొ, కాని వేళ;
    అబ్బ జ్ఞాన, మతని యంత మందున గాక
    అది నబ్బ, మంచి యగును; చైతు!



    "పెద్ద వారి మాట చద్ది మూట" యనిరి;
    పెద్దలన్న నిపుడు పెదవి విరుపు;
    హద్దులన్న వారి కది యిష్ట ముండదే!
    స్వేచ్ఛ యెక్కువైన చెడుటె; చైతు!



    భరతదేశ మన్న గురుపరంపర, యోగ
    పుంగవులకును, ఋషి పూజ్యులకును
    నెలవు; విశ్వమందు వెలసిన మతముల
    సమత, గోరుకొనెడి జాతి; చైతు!



    మనసు మంచిదైన మంచి యే కనిపించు;
    మలినమైన మనసు తెలివి దప్పు;
    తెలివి కలుగ మనసు మలినమ్ము తొలగును;
    మంచి వైపు తాను మళ్ళు; చైతు!



    రాజకీయ మందు రగిలిన స్వార్థమ్ము
    అన్ని రంగములను నావహించె;
    ప్రభుత మార్గమిపుడు ప్రజల కాదర్శమ్ము
    ప్రభుత కంచె మేసె;పట్టు; చైతు!



    సృష్టి చేయుచున్న శిక్షలు చాలవా?
    ఉగ్రవాదమేల? ఉద్యమమ్ము?
    భయపు టంచు లందు ప్రజనుంచు క్రూరత్వ
    మే, మతమును నేర్పదిలను చైతు!



    స్త్రీల కెచట పూజ చేతురో యచ్చట
    దేవతాళి వచ్చి తిరుగునంట!
    బడిత పూజ చేయు భర్తల యిండ్లలో
    తిరుగ రాదొ! మంచి జరుగు: చైతు!



    సంఘ మందు బ్రతుక, సహనమ్ము కావలె;
    యుద్ధ మందు శౌర్య బుద్ధి వలయు;
    యుద్ధమేల మనకు పెద్ద లందరి బుద్ధి
    నవ్యమైన, దొరుకు శాంతి; చైతు!

    మౌనీ రాగాలు శతక పద్యాలు

    శ్రీ బి.వి. బంగార్రాజు గారు రచించి పద్యాలు



    అమ్మను మించిన దైవము
    ఇమ్మహి లేదదియె నిజము ఏమర కెపుడున్
    బమ్మయ్య ఏమి చేసెనొ
    అమ్మేగా నిన్ను కన్న దవనిని మౌనీ!



    పుట్టిన జీవాలన్నియు
    గిట్టుట ధర్మమ్ము ప్రకృతి గేహమునందున్;
    పుట్టితివి మనుజ జన్మను
    గట్టిగ మేలొకటి సేయ గావలె మౌనీ!



    కల్లా కపటము లెరుగవు
    కల్లోలపు లోకమందు కాలిడి తివహో
    కల్లోల మంట కుండగ
    నుల్లాసము తోడి బ్రతుకు నొందుము మౌనీ!


    పనియే దైవం బిలలో
    పనిచేయుట పూజయగును పరమాత్మునకున్;
    ఘనులందరు పనిలోనే
    మనసును లగ్నమ్ము చేసి మనెదరు మౌనీ!


    పరులకు సేవలు చేయుట,
    పరమాత్ముని పూజయగును పరికింపంగా;
    కరుణామయు లీ మాటనె
    తరియింపగ చెప్పినారు తలపుము మౌనీ!


    మన సంస్కృతి, మన ధర్మము
    ఘనమైనది విశ్వమందు కాదన గలరే!
    కన జాలని మౌడ్యముచే
    మనముంటిమి తెలివికలిగి మసలుము మౌనీ!


    నీవే దైవము దయ్యము
    నీవే సుఖ దు:ఖములకు నెలవై నిలువన్,
    భావించ నేల నితరులు
    జీవిత విద్రోహులనుచు సిగ్గది మౌనీ!


    నుదుటను బ్రహ్మయరాతని,
    ఇది పూర్వపు కర్మయంచు నేడ్చుట యెల్లన్
    వదలని మూర్ఖత్వం బిది
    కదలక కూర్చున్న ఫలము కలుగునె మౌనీ!


    కన్యా శుల్కము పేరిట
    నన్యాయము జరిగే పూర్వ మతివలకిలలో;
    ఏ న్యాయ మిప్పుడున్నది?
    కన్యల పాలిట శని వరకట్నము మౌనీ!


    'మతపిచ్చి'యు, 'కుల పిచ్చి'యు
    వెతలను కలిగించె నేడు విపరీతముగా;
    గత చరిత మెరిగి కూడా
    'కుతికల'వరకెందు కింత క్రోధము మౌనీ!


    పరమేశుడు గుడి లోపల
    గిరిగీసు కొనుండ డమ్మ ఖేదము బాపన్;
    గురినిల్పు హృదయముండిన
    పరమేశుని జూతు వన్ని ప్రాణుల మౌనీ!


    ద్వేషింపకు పరమతమును,
    దూషింపకు కులము పేర దుష్టుం డైనన్,
    వేషాలకు విలువివ్వకు,
    రోషావేశాల కెపుడు లొంగకు మౌనీ!


    'అల్లా' 'రాముడు' 'జీససు'
    కల్లా కపటములు లేని కరుణామయులే;
    ఎల్లరి మూలం బొకటని
    వెల్లడియగు, తెలియ లేరె? వెర్రా! మౌనీ!


    పతిపోయిన స్త్రీలందరు
    గతిలేదని యేడ్చినంత కరుగుదురె జనుల్;
    వెతలకు వెరువక నిలబడి
    బ్రతుకును సాగింప తమకు భావ్యము మౌనీ!


    పురుషాధిక్యపు సమాజపు
    షరతులు మరి సాగ వలదు శాస్త్రము పేరన్;
    తరుణుల రెండవ స్థానము
    సరికాదని సమమటంచు చాటుము మౌనీ!


    అబలను నేనని క్రుంగకు;
    కబళించును లోక మెల్ల కర్కశరీతిన్;
    శబలను నేనని ధైర్యము
    నిభిడీ కృతమైన జయము నీయది మౌనీ!


    మన ఆచారపు, పెండిలి
    మన దాంపత్యంపు సరళి, మన జీవనముల్
    కనమెందు విశ్వమందున
    మనసుకు ప్రాధాన్యమిచ్చు మార్గము మౌనీ!


    ప్రేమయె దైవం బిలలో;
    ప్రేమయె సుఖ జీవనమ్ము పెన్నిధి సుమ్మీ!
    ప్రేమించు మెల్ల వారిని
    భూమండల మంత శాంతి పొందును మౌనీ!


    శిబి చక్రవర్తి త్యాగము,
    అభిరాముని పితృవాక్య మందభిరుచియున్,
    ప్రభువు హరిశ్చంద్రు నిజము,
    విభుకర్ణుని దాన గుణము విలువలు మౌనీ!


    గౌతమ బుద్దుని కరుణయు,
    జాతికి పితయైన గాంధి శాంతి, అహింసల్
    మాత థెరిస్సా సేవలు
    నీతర మాదర్శములుగ నిలుపుము మౌనీ!


    ధన బలము కలుగు వారలు
    మన నీయరు బీదవారి మంచిగా నిలలో;
    పనిగట్టుకు పడ ద్రోయరె?
    నినదించుము దీనికెదురు నీవును మౌనీ!


    మనిషికి మరణము తథ్యము;
    పనిచేయుచు నుండవలయు బ్రతికిన నాళ్లన్
    పనిమానుట యన మరణము
    కనుకనె పని మానతగదు జ్ఞానికి మౌనీ!


    మనమున కలిగెడు దుఃఖము
    క్షణమున పోగొట్టు మందు కనుగొనె గురువుల్
    కనగానదియే 'వర'మీ
    జనకోటికి "ధ్యాన"యోగ సాధన మౌనీ!

    Blog Archive

    • ▼  2012 (71)
      • ▼  December (4)
        • HAIKU AWARDS PRESS CUTTING
        • Sri B.V.Bangarraju Padyaalu
        • HAIKU PURASKAARAALU - Sri B.V.BANGARRAJU AS CHIEF ...
        • Manasu-Manishi anthryaami article by Sri B.V.Banga...
      • ►  August (1)
      • ►  July (6)
      • ►  June (32)
      • ►  May (28)

    About Me

    My photo
    B.V.Bangar Raju
    పుట్టింది:
    1938 అక్టోబర్ 3 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం తాలూకా మట్ల పాలెం అనే గ్రామం.
    తల్లిదండ్రులు:
    బుద్దరాజు,విశాలాక్షి దంపతులకు జన్మించారు.
    వివాహం
    మేనమామగారి 2 వ పుత్రిక సత్యవతి ని 1954 వ సంవత్సరం లో పెళ్ళిచేసుకున్నారు.
    సంతానం:
    ఇద్దరు కుమార్తెలు , ఇద్దరు కుమారులు.
    వృతి:
    1961 నుండి 1982 వరకు ఇంజనీరుగా..1992 నుండి వ్యాపారం
    ప్రవృతి:
    రచనా వ్యాసంగం,కళా రంగ సేవ
    వ్యవస్థాపకులు:
    మెపర్స్ ఫై.ఎన్.రాజు అండ్ కో పార్టనర్షిప్ ఫర్మ్ (వ్యాపార సంస్థ) బాల కవితా మండలి (సాహిత్య సంస్థ)
    ప్రచురణలు:
    "అమృతాహారం" అనువాదం (1994 )
    "అంతా నీ సొంతం "సమిష్టి అనువాదం (1995 )
    "స్వగతం" "సిద్ధ సమాధి యోగ "పద్యాలు (1998 )
    "ఋషి వాణి" తెలుగు మాసపత్రిక నిర్వహణ (1998 వరకు)
    "మౌనీరాగాలు" ( శతకం మరియు ఖండిక) ఏప్రిల్ 2001
    "చైతన్య రాగాలు " ( శతకం మరియు ఖండిక) ఏప్రిల్ 2002
    నటునిగా:
    "వాపసు", "శర్మగారి రాష్ట్రం" నాటికల్లో,"గుడిగుడిగుంచం" టెలి సీరియల్లో ...
    నాటక రచయితగా:
    అమాయకుడు"నాటిక రచయితగా. జగన్నాథ నాటక కళా పరిషత్ గౌరవ అధ్యక్షులుగా నాటక రంగానికి సేవ.
    "విశాఖ రత్న"బిరుదాంకితులు
    View my complete profile
    • Essays as PDF color
    • Essays as PDF

    matlapalem

    Matlapalem
    Latitude : 16°30'45.06"N
    Longitude : 81°48'39.20"E
    Theme images by TommyIX. Powered by Blogger.