మహోన్నత వ్యక్తులు ఎప్పటికీ ఆదర్శనీయమే!. వారి గూర్చి నేటి తరానికి తెలియజేయడం మన బాధ్యత. నీతి శతకాలలో ఇటువంటి పద్యాలు ఉండతగినవి. చరిత్ర, పురాణాలు,ఇతిహాహాసలోని ఆదర్శనీయమైన, పూజ్యనీయమైన వ్యక్తులను శతక పద్యాలకు వస్తువులుగా చేసుకొని సందేశాత్మక పద్యాలను రచించారు బంగార్రాజు. త్యాగానికి, తండ్రిమాటకి,సత్యానికి,దానగుణానికి ప్రతీకలైన వ్యక్తులను, వారి ప్రత్యేకతలను కవి
"శిబిచక్రవర్తి త్యాగము,
అభిరాముని పితృవాక్య మందభిరుచియున్,
ప్రభువు హరిశ్చంద్రు నిజము,
విభుకర్ణుని దాన గుణము విలువలు మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని మహనీయుల విలువలను ప్రస్తావిస్తారు బంగార్రాజు గారు.
కరుణ,శాంతి,అహింస,మానవ సేవ మొదలగున సద్గుణాలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి, మరిముఖ్యంగా నేటితరం! అందుకే ~"
" గౌతమ బుద్ధుని కరుణయు,
జాతికి పితయైన గాంధి శాంతి, అహింసల్
మాత థెరిస్సా సేవలు
నీతర మాదర్శములుగ నిలుపుము మౌనీ! "(వీడియోకై క్లిక్ చెయ్యండి) అని మహనీయుల ఈ సుగుణాలను మన మనసులో నిలుపుకొని మసలుకోవాలని కవి ఉద్భోదిస్తారు.
దేశాన్ని పట్టిపీడించే అంశాలలో మూడాచారాలు ఒకటి. రాజా రామమోహనరాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలగు సంఘసంస్కర్తలు కొందరు ఇటువంటి భావాలను ప్రజల మనసుల్లోనుంచి తీసివెయ్యడానికి వారి జీవితాన్నే అంకితం చేశారు. రాకెట్ యుగమని చెప్పుకునే ఈరోజుల్లో కూడా మూడాచారాలను అనుసరించేవారున్నారంటే ఆశ్చర్యమే! . అప్పుడంటే రామమోహనరాయ్, కందుకూరి వారు ఉన్నారు. మరి అటువంటి వారు నేడేరీ? అందుకే ~
" మూడాచారములెన్నో
పీడించుచు నుండె జనుల వృత్తము నెల్లన్;
రాడే "రాజారాము"డు
లేడొకొ 'వీరేశలింగ'రేడిట మౌనీ! " అని ప్రశ్నిస్తున్నాడు కవి నేటి తరం యువతను. ఈ దేశీయులలో ఉన్న మూడాచారాలను పోగొట్టేందుకు ఒక్కొక్కరు రామమోహనరాయ్, కందుకూరి వారి అవతారమెత్తాలని కవి ఆశ. ఇదే కవి భావం!
ఈ రకంగా కవి బంగార్రాజు నేటి తరం యువకులకు మహానీయులగూర్చి చెప్పడమే కాదు, వారి ఆదర్శనీయమైన గుణగణాలను పుణికి పుచ్చుకొని దేశం వర్దిల్లడంలో తోడ్పడాలని తన శతకపద్యాలద్వార తెలియజేసారు బంగార్రాజు.
No comments:
Post a Comment