శ్రీ బి.వి.బంగార్రాజు వృత్తి రీత్యా ఇంజనీర్. సాహిత్యాభిమాని. చదువుకొనే విద్యార్థి దశలోని ఆ సాహిత్య వాతావరణమే బంగార్రాజు గారిని కవిగా చేసింది. అవధానిగా పేరున్న బులుసు వెంకన్న పరిచయమే బంగార్రజుగారిని కవిగా మలిచింది. ఆ స్పూర్తితోనే ఆశువుగా పద్యాలు చెప్పే అనుభువంతో కాకినాడలో 1999 లో బంగార్రాజు ఐదుగురు పృచ్ఛకులతో పంచావధానం చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాతా చాలా అవధానాలలో పృచ్ఛకునిగా పాల్గొనడం ప్రారంభించారు. ఇప్పటివరకు 50 అష్టావధానాలలో చందోభాషణ చేసే పృచ్ఛకునిగా పాల్గొన్నారు. ఇవిగాక శతావధానాలు, సహస్రావధానాల కార్యక్రమాలలో పాల్గొన్నారు.
చిన్నప్పట్నుంచి సాహిత్యంపట్ల మక్కువ ఎక్కువ వున్నా బంగార్రాజు గారు తన 18 వ యేట "బాల కవితామండలి"అనే సంస్థను స్థాపించారు. తన 20 వ యేట ఓ జమిందారు గారిపై "పంచరత్నాలు"పేరున చక్కని పద్యాలు రాసి బాలకవిగా గుర్తింపు పొందారు బంగార్రాజు గారు. కాకినాడ స్థానిక పత్రికలోనూ, నర్సాపురం నుండి వెలువడే "ఉపాధ్యాయిని " పత్రికలోనూ, ఆంధ్రా పాలిటెక్నిక్ పత్రికలోనూ బంగార్రాజు గారి పలు రచనలు ప్రచురింప బడ్డాయి. "రమ్య గుణ సాంద్ర పట్టాభి రామచంద్ర" అనే మకుటంతో 100 సీస పద్యాలతో తన స్వగ్రామంలోని పట్టాభి దేవునిపై రాసిన శతకాన్ని చదివి బాగుందని మంగమ్మ అనే తెలిసిన ఒక మహిళ మద్రాసు పట్టుకు పోయారు. ఆ తర్వాత ఆ ప్రతి ఆయనకు తిరిగి రాలేదు. ఆ విధంగా మొదటి శతకాన్ని రచించి పోగొట్టుకున్నారు బంగార్రాజు గారు. ఆతర్వాత అప్పుడప్పుడు రాసిన పద్య కవిత్వం చాల ఉంది.సుమారు 120 పద్యాలు ఏలూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నారు రాజుగారు. ఆతర్వాతనుంచి అప్పుడప్పుడు అలవాటుగా రాసిపెట్టుకున్న శతక పద్యాలను ప్రముఖ సాహితీ వేత్త డా.ద్వా.నా.శాస్త్రి అనుకోకుండా చూడడం జరిగింది.ఆ పద్యాలను చదివి, మెచ్చుకొని పుస్తక రూపంలోకి తీసుకురావాలని బంగార్రాజు గారిని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో ఏప్రిల్ 2001 లో రాజుగారు "మౌనీరాగాలు" పేరుతో పద్యకవితా సంపుటిని ప్రచురించారు. ఇందులో రాజుగారు తన మనుమరాలు మౌనికను సంబోధిస్తూ పద్యాలు చెబుతున్నట్లు "మౌనీ" మకుటంతో 100 కంద పద్యాలతో "మౌనీశతకాన్ని" ఈ సంపుటిలో ప్రచురించడమే గాకుండా, క్రాంతిపథం, ధరణీ విలాసం, మహిళ, పగ-ప్రతీకారం, సభ్యత-సంస్కారం, అమ్మపిలుపు, చైతన్యం,విశ్వయానం, సంకల్పం, మినీకవితలు, జీవాలు-భావాలు,పల్లెలు-భాగ్యాలు,మన విశాఖ శీర్షికలతో 13 పద్య ఖండికలను "మౌనీరాగాలు" అనే పద్య కవితా సంపుటిలోనే ప్రచురించారు. ఈ సంపుటిని తన జీవిత భాగస్వామి సత్యవతి గారికి అంకితమిచ్చారు.
ఏప్రిల్ 2002 లో "చైతన్యరాగాలు" అనే మరో పద్యకవితా సంపుటిని ప్రచురించారు. ఈ సంపుటిలో 108 ఆటవెలది పద్యాలతో కూడిన "చైతన్య శతకం" ఉంది. ఇదిగాక..."మతమంటే",సీమంతోత్సవ శుభాశీస్సులు, బ్రహ్మరాత అనే శీర్షికలతో కూడిన పద్యఖండికలు, కాన్వెంట్ చదువులు, గురుస్తుతి అనే రెండు గేయాలను రచించారు. ఈ సంపుటిని తనను పెంచి పెద్దచేసిన అమ్మమ్మ "వేంకట నరసమ్మ " గారికి అంకితమిచ్చారు. ఇవిగాకుండా 29 పద్యాలలో స్వాగతం పేరుతో సంక్షిప్తంగా తన జీవిత చరిత్రను రాసుకున్నారు. వీటిని రాజుగారి సష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా 30 అక్టోబర్ 1998 న ప్రచురించారు. ఇదే సంచికలో "శ్రీ శనగల నరసింహస్వామి 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో నిర్వహించిన "సమస్యాపూరణం"లోని సమస్యలకు బంగార్రాజు గారు పూరించి పంపగా ప్రచురితమైన వాటిలో కొన్నింటిని ప్రచురించారు. ఇవిగాక "సిద్ద సమాధి యోగ" శీర్షికతో రాసిన 9 పద్యాలను కూడా రాజుగారు ప్రచురించారు. ఇక వివిధ సందర్భాలలో, వివిధ సమావేశాలకై, అతిథులకు, కవులకు ఆశీస్సులు అందిస్తూ రాసిన పద్యాలకు లెక్కే లేదు. విశాఖపట్నం ఆలిండియా రేడియో కేంద్రంలో ప్రసారమైన "సమస్యాపూరణం" కార్యక్రం నిర్వాహకునిగా ఎందఱో కవుల అభిమానాన్ని చూరగొన్నారు.
బంగార్రాజు గారు పద్యకవిత్వమే కాదు; అనువాద రచనలనూ చేపట్టారు.1994 లో "అమృతాహారం", "అంతానీసొంతం" అనే అనువాద రచనలు చేశారు. బంగార్రాజు గారు "ఋషి వాణి " అనే తెలుగు మాసపత్రికను 1998 వరకు నిర్వహించారు. ఇవిగాక వివిధ సాహితీ,సాంస్కృతిక సమావేశాలకు అధ్యక్షునిగా,ముఖ్య అతిథిగా,గౌరవ అతిథిగా,ఆత్మీయ అతిథిగా,సన్మాన కర్తగా వ్యవహరించారు. వారు చేస్తున్న సాహితీ సేవకు ఎన్నో సన్మాన సత్కారాలను స్వీకరించారు. ఎన్నో సాహితీ సాంస్కృతిక సంస్థలను వారు ప్రోత్సహించారు. వివిధ సాహితీ,సాంస్కృతిక సంస్థలకు వారు గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
భీమిలిలో ఉద్యోగం చేస్తుండగా కళాభిమానంతో 1963 లో సమితి ఆవరణలో "ఆరుబయట రంగస్థలం"(ఓపెన్ ఎయిర్ థియోటర్) నిర్మించారు. 1955 లో "అమాయకుడు", 1962 లో "కింకర్తవ్యం" అనే నాటికలు రచించారు బంగార్రాజుగారు. 1963 లో దాసరి గోపాల కృష్ణ అనే రచయిత రచించిన "చిల్లరకొట్టు చిట్టెమ్మ" అనే నాటికకు దర్శకత్వం వహించి విజయనగరం లో జరిగిన పరిషత్ పోటీలలో పాల్గొని షీల్డ్ ను గెలుచుకోచ్చారు. 1954 లో డి.వి.నరసరాజు గారు రచించిన "వాపసు"నాటికలో "శటగోపం "పాత్ర ధరించి నటించారు బంగార్రాజు. శర్మగారి "రాష్ట్రం"నాటికలో హాస్య పాత్రలోనూ, "గుడిగుడి గుంచం"టెలీ సీరియల్ లోనూ, విశాఖవాసుల్లో ఆరోగ్య భద్రత కల్పించే ఉద్దేశంతో విశాఖ నగరాభివృద్ధి సంస్థ వారు "దాసరి కల్చరల్ అకాడెమీ" సారధ్యంలో నిర్మించిన మరో టెలీ ఫిలిం లోనూ రాజుగారు నటించారు.
రాజుగారికి సాహితీ సాంస్కృతిక రంగాలపై ఉన్న అభిరుచికొద్దీ, మనుమరాలుని మంచి నర్తకిగా, పెద్ద కుమార్తెని మంచి వీణా వాద్య కళా కారిణిగా తయారుచేశారు, ప్రోత్సహించారు. రాజుగారి పెద్ద కుమారుడు,. చిన్న కుమార్తె ఇరువురు డాక్టర్ లైనా గేయాలు,వచన కవితలు రాస్తూ సాహితీ రంగంపై వారికున్న మమకారాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరి తండ్రి రాజుగారు వారికి ప్రేరణగా నిలిచారు.
మహా సహస్రావధాని డా.గరికపాటి నరసింహారావు, ప్రఖ్యాత విమర్శకులు డా.ద్వా.నా.శాస్త్రి,పండితులు శ్రీ దివాకర్ల రామమూర్తి, శ్రీ పేరాల భరతశర్మ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన కవి శ్రీ బి.వి.బంగార్రాజు.
వ్యక్తిత్వం:
బంగార్రాజు గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు.5 మాసాల ప్రాయంలోనే కలరా వల్ల తల్లిని కోల్పోయిన దురదృష్ట వంతుడు బంగార్రాజు. పెద్దమ్మ పురిటి సమయంలో వైద్య సహాయం లేక మరణించింది. 10 వ యేటనే ఈ సంఘటనలు ఆయనపై ప్రభావాన్ని చూపాయి.. తన్ను ఎలాగైనా డాక్టర్ కావాలనే సంకల్పం కలిగింది గాని నెరవేరలేదు. తన కోరికగానే మిగిలిపోయిన డాక్టర్ చదువును తన కుమారుడు, కుమార్తెల ద్వారా నేరవేర్చుకోవడమే గాక, ఆతర్వాత మనుమరాలు,మనుమడు కూడా డాక్టర్ చదవడానికి పరోక్ష స్ఫూర్తి బంగార్రాజు గారే! ఐదు మాసాల ప్రాయంలోనే తానూ కోల్పోయిన తన తల్లిగారి జ్ఞాపకార్థం తల్లి స్వగ్రామం నేరేడుమిల్లిలో స్థలం కొని ఆసుపత్రి నిర్మించిన మాతృ భక్తిగల మంచి వ్యక్తిత్వం శ్రీ బి.వి.బంగార్రాజు. తల్లి మరణాంతరం ఇరవై సంవత్సరాలపాటు తనను పెంచి పెద్ద చేసిన అమ్మలాంటి అమ్మమకు తన కావ్య సంపదను ఆమె పాదపద్మాలకు సమర్పించి సత్కరించిన కృతజ్ఞతా భావం తొణికిసలాడే ప్రేమ మూర్తి బి.వి.బంగార్రాజు గారు. బంగార్రాజు గారు సౌమ్యులు,మితభాషి, మృదుభాషి, దృఢ సంకల్పి,దానశీలి,స్నేహశీలి. పరోపకార పరాయణులు. సాహితీ సాంస్కృతిక కళా ఆరాధకులు - ప్రోత్సాహకులు. వారి గూర్చి ఎన్ని చెప్పుకున్న తక్కువే!
- వ్యాస రచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
No comments:
Post a Comment