ఆధునిక శతక కవులు అనేక నూతన కవితా వస్తువులపై కవిత్వ రచన చేస్తున్నారు. సెల్ ఫోన్, సెజ్ లు, షేర్ లు మొదలుగున్నవే కాకుండా ఆహార విశేషాలను కవితా వస్తువులుగా తీసుకొని బంగార్రాజు కొన్ని సందేశాత్మక శతక పద్యాలను రచించారు. ఈ ఆధునిక కాలంలో మనం ఊహించని క్రొత్త వస్తువులు వచ్చినట్లే క్రొత్త ఆహార వస్తువులు, తద్వారా క్రొత్త జబ్బులు. నూడిల్స్ మనం మునుపెరగని ఫాస్ట్ ఫుడ్. మనం ఇటీవలి కాలం లో తింటున్న చిరుతిండ్లకు బహుమానమన్నట్లు 'గాస్టిక్కు', 'అల్సర్లు' మొదలగు జబ్బులు. అధికంగా కారం, ఉప్పు,మసాలాలు వినియోగించడం వివిధ జబ్బులకు కారణం. కనుక కవి
" పచ్చి మిర్చి తోడ బజ్జీలె కాకుండ
కూరలందు జేర్చి కూరుకున్న
కడుపు మంటె కాదు, 'గాస్టిక్కు', 'అల్సర్లు'
విడువ వలయు నవ్వి పడవు; చైతు! "అని హితబోధ చేశారు.
శాకాహారం,మాంసాహారం. నాకు తెలిసి ఈ లోకం లో అధికులు మాంసాహారులే! శాకాహారాన్ని సాత్విక ఆహారంగా చెప్పుకుంటాము. ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం వల్ల అధిక కొవ్వు. తద్వారా గుండె జబ్బులు. బి.పి మొదలగున్నవి. మాంసాహారం చాలదన్నట్లు పొగతాగుతారు. ఇంకొందరు మద్యాన్ని సేవిస్తారు. ఇవన్ని గుండెపై...మనిషి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ~
" మాంస భక్షణమ్ము, మదినిండ "ఒత్తిడి"
పొగను త్రాగు బుద్ధి ముంచు బ్రతుకు;
గుండె రక్తనాళ కుడ్యాలు కుంచించి
ఆగిపోవు గుండె యంతె; చైతు! " అని కవి బంగార్రాజు తిండిబోతులకు,తాగుబోతులకు జరగబోవు అనర్థాలను పై పద్యం ద్వారా తెలియపరిచారు.
మితిమీరినది ఏదైనా సరే ప్రమాద కరమే...అది మంచిదే అయినా. అమితాహారము విషతుల్యము. తినడమెంత ముఖ్యమో శరీరానికి వ్యాయామమూ అంతే ముఖ్యం. ప్రతిదినం వ్యాయామం, మంచి ఆలోచనలతో మనసును ఉంచుకొనడం,మితంగా భుజించుట ఇవన్నీ మంచి ఆరోగ్యానికి మార్గాలని~
" ప్రతి దినమును వ్యాయామము,
వ్యతిరేకపు భావములను వదలుట మనమున్,
మితమగు ఆహారమ్మును
బ్రతుకున కారోగ్య మొసగు బాటలు మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి)అని మనందరికీ తన ఆరోగ్య రహస్యాలను తెలియ జేశారు. 1938 లో జన్మించిన వీరు ఇప్పటికి ఆరోగ్యంగా ఉండడానికి ఇవే నియమాలు.
ఈవిధంగా కవి బంగార్రాజు తన రెండు శతకాలలో మంచి ఆరోగ్యానికి మంచి ఆహార నియమాలను ఎలా అలవార్చుకోవాలో పై పద్యాలద్వార మనకు తెలియ జేశారు.
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
No comments:
Post a Comment