రాజకీయ రంగంపై స్పందించని కవి ఉండదు. రాజకీయ రంగానికి సంబంధించి తన భావాన్ని పంచుకొని కవి ఉండదంటే అతిశయోక్తి కాదు. పద్యమైన,కథైనా,కవితైన..
అది ఏ ప్రక్రియైనా సరే ప్రసిద్ధ కవిత వస్తువై పోయింది నేటి రాజకీయం. నేటి రాజకీయ రంగం గూర్చి, నాయకులగూర్చి,వారి దోపిడీ గూర్చి బంగార్రాజు గారు కూడా పద్య రూపంలో తన స్పందనను తెలియజేసారు.
మధ్య మధ్యలో కొన్ని ప్రభుత్వాలు అధికారాన్ని చేజిక్కించుకోడానికి, ఆడవాళ్ళ ఓట్లు రాబట్టుకోడానికి మమ్మల్ని గెలిపిస్తే "మద్యపాన నిషేధం" తీసుకొస్తామని హామీలిచ్చి, గెలిచాక కొంతకాలమే ఆ ప్రభుత్వాలు ఆ హామీలకు కట్టుబడి పనిచేశాయి. ఇప్పుడైతే ప్రభుత్వ ఆర్ధిక వనరులలో కీలక భూమిక పోషించేది మద్యమే. సారా మైకంతో సంసారాలు నాశనమవడం, స్త్రీలు సారాకు బానిసలైన భర్తల చేతిలో నరక యాతనను అనుభవించ డాన్ని గమనించిన కవి బంగార్రాజు చింతిస్తూ ~
" సారా త్రాగిన మైకము
నారీలోకాని కంత నరకము కాదే?
ఈ రాజకీయు అందరు
ఈ రీతిగా నూరకుంట ఎందుకు మౌనీ!" అని ఆవేదన వ్యక్తం చేస్తారు. సారా సమాజానికి చేసే చేటును నాయకులు చూస్తూ మౌనంగా ఉండక సారా మహమ్మారిని శాశ్వతంగా నిషేదించాలని తన ఆశాభావాన్ని ప్రకటించారు.
నేడు రాజకీయ నాయకుల అవతారమెత్తే వారందరూ నిజంగా ప్రజాసేవకు కాదు, కోట్లు కూడబెట్టేందుకే! ప్రజలకు సేవ చేయ్యలనుకునేవాడు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టాల్సిన పనిలేదు. ప్రజలు గెలిపిస్తే సేవ చేస్తాడు...లేకపోతే లేదు. అంతే! ప్రజలకు నిజంగా సేవచేయ్యాలనుకునేవాడికి నిజంగా సేవచేయ్యాలనే మనసుంటే చాలు. మరెందు నాయకులకు ఇన్ని కోట్ల ఖర్చు...ఇన్ని అవతారాలు, ఇన్ని ఫీట్లు...పాట్లు అంటే పెట్టిన ఖర్చుకు పదింతలు స్వల్ప వ్యవధిలో రాబట్టుకోడానికి మేలైన మార్గం రాజకీయం. అందుకే~
" "ఎన్నిక" ల గురించి యింతింత ఖర్చులా
ప్రజల సేవ చేయు భాగ్యమునక?
సేవలకొరకైన చిత్తమ్ము చాలదా?
కోట్లు కూడబెట్టు "ఫీట్లు" చైతు! " అని నాయకుల ఫీట్లవెనకున్నదోపిడీ తత్వాన్ని బహిర్గతం చేశారు బంగార్రాజు గారు.
ప్రజా సేవ పేరుతో చాలా మంది రౌడీలు,గూండాలు,దోపిడీ దారులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. దేశాన్ని ఉద్దరిస్తామని హామీలు ఇచ్చి గెలిచాక ప్రజల నేతిన శటగోపం పెట్టి హైదరాబాదు డిల్లీ లకు పారిపోతారు. సంపాయించిన అక్రమ సంపాదనను,సంపాయించ బోయే అక్రమ సంపాదనకు రక్షణ కవచంలా ఉపయోగపడేదే రాజకీయమని గ్రహించి చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ ఆలోచనలతోనే~
" జనుల నెత్తిపైన శటగోపములు పెట్టి,
బోర విరుచు కొనెడు నేరగాండ్రు
రాజకీయమందు రంగ ప్రవేశమ్ము,
సొమ్ము భద్రమునకు సుమ్ము; చైతు!" అని రాజకీయం గుట్టు విప్పారు కవి బంగార్రాజు.
దేశమేమై పోతుందనే బాధ నాయకుల్లో లేదు, అధికారులలో లేదు. అంతకు మించి ప్రజల్లో లేదు. తవ్వే కొద్ది బయటపడే కుంభ కోణాలు. దేశాన్ని రక్షించాల్సిన వారు అలక్ష్యం చేస్తూ దేశ ద్రోహం చేస్తున్నారు. కనుకనే ఇది చూస్తూ సహించలేని కవి బంగార్రాజు~
" దేశ భక్తి చూడు 'తెహల్క' టేపులో
చిక్కి శల్య మయ్యె శిరము వంచి
రక్ష సేయు వారె లక్ష్యమ్ము విడనాడ
దేశమేమగు నొకొ! తెలియు; చైతు! " అని అంటారు.
కోతలు కోసే నాయకులు,శుష్క వాగ్దానాలను చేసే నాయకులు తప్పించి నీతికి ప్రతీకగా నిలిచే నాయకు డొక్కడు కూడా లేడు నేడు! పదవికోసం ఏమి చెయ్యడానికైనా వెనుకాడని నాయకులే నేడు. పదివి లేకుంటే క్షణం క్షణం ఛస్తూ బ్రతుకుతున్నట్లు ఉంటారు నేటి నాయకులు. ఇటువంటి నాయకుల స్వభావాన్ని గమనించే ~
" నీతి కొరకు చచ్చు నేత యొక్కడు లేడు;
ప్రాణ మిత్తు ననును పదవియన్న;
పదవి లేదటన్న పలుకులే వికటించు;
విలువలన్నిగాలి గలిసె; చైతు! " అని కవి గంగార్రాజు అన్నారు.
గట్టున మెయ్యాల్సిన ఆవు చేలోపడి మేస్తుంటే, దాని దూడ గట్టున మేస్తుందా? అన్న చందాన దోపిడీ నాయకుల అండతో అధికారులు రెచ్చిపోయి దోపిడీకి పాల్పడుతున్నారు నిర్భయంగా. "ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అని ఆత్రేయ అన్న మాటలకు ప్రతినిధులై నిల్చున్నారు నేటి నాయకులు. అవినీతిని అంతమొందిస్తామంటూ మూడు అవినీతులు, ఆరు ఆక్రమాలు గా వర్తిల్లు తున్నారు నేటి నేతలు. అందుకే ~
" నీతి నిలుపుమనుచు నేతలు వల్లించి,
'స్కాము'లందు తామె స్వాములగుట,
ఆవు చేను మేయ, నది చూచుచును దూడ
గట్టు నెట్టు లుండ గలదు? చైతు! " అని కవి స్కాముల స్వాముల నిజరూపాన్ని బట్ట బయలుచేశారు.
అసలు ప్రభుత్వమంటే ఏమిటి? నాయకుడంటే ఎవరు? ప్రజలు ఓట్లేసి గెలిపించి ఒకడ్ని నాయకుడ్ని చేస్తే , అలా గెలిచిన నాయకులు(ప్రభుత్వం) ప్రజా ధనాన్ని లూటీ చేస్తుంది. నాయకులు మనకు సేవచేయ్యల్సింది పోయి మనపై పెత్తనం చేస్తున్నారు. అధికారాన్ని ప్రదర్శిస్తుంటారు. అందుకే ప్రజలను ఆలోచించి
" ప్రభుత యెవరి దయ్య "ప్రజలెన్ను కొన్నది"
హింస రేపుటెల్ల నెవరి కొరకు?
ఆస్తి తగులబెట్ట నదినీకు చెందదా?
ఎరుక నేర్పు ప్రజకు సరిగ;చైతు! " అని ప్రభుత్వాన్ని ప్రశ్నించ మంటున్నాడు కవి బంగార్రాజు.
గెలిచిన నాయకులు ప్రజా ధనాన్ని దోచుకొని తినడమే కాదు, రకరకాల పేర్లతో పన్నులు విధించి పేదల నడ్డి విరుస్తుంటారు గెలిపించిన పాపానికి. కుంభకోణాలు చెయ్యకుండా, అవినీతికి నాయకులు పాల్పడకుండా ఉంటే పన్నులు వెయ్యాల్సిన పరిస్థితి ఉండదుకదా? స్వదేశంలో దోచుకొని విదేశాలలో దాచుకున్న నల్ల ధనాన్ని తెస్తే ఈ పన్ను పోటులు ఉండవుకదా! అందుకే ~
" పేదవాని నడుము పెళుసుగా నుండును;
విరిగి పోవు "పన్ను"వేయగానె;
స్కాములందు సొమ్ము సర్దుకు పోకున్న
బక్క వాని కేల పన్ను? చైతు! " అని అంటారు కవి బంగార్రాజు. కనుక స్వార్థమే పరమావధిగా రాజకీయాలలోకి వచ్చేవారు స్వార్థాన్ని విడనాడి ప్రజలకు ఆదర్శ ప్రాయముగా నిలవాలని కోరుతూ ~
" రాజకీయ మందు రగిలిన స్వార్థమ్ము
ప్రభుత మార్గమిపుడు ప్రజల కాదర్శమ్ము
ప్రభుత కంచే మేసె;పట్టు; చైతు! " అని అంటారు బంగార్రాజు.
దేశ పాలకులు యువతను నైరాశ్యంలోకి నేట్టివేస్తున్నారు.ఉద్యోగ, ఉపాది, రాజకీయ అవకాశాలు యువతకు కల్పించడం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. భవిష్యత్ అంధకార మయంగా ఉన్న యువతను ఉద్ధరించాలి,మేల్కొల్పాలి అని కవి బి.వి.బంగార్రాజు ~
" యువతను నైరాశ్యములో
పవళింపగ జేసె దేశ పాలక గణముల్;
భవితవ్యము చీకటియా?
యువతను మేల్కొలుప నెంత యోగ్యము మౌనీ! " అని అంటారు.
ఈ విధంగా బంగార్రాజు తన రెండు శతకాలలో రాజకీయ రంగానికి సంబంధించిన తన భావాలను తన పద్యాలలో వెలువరించారు. మంచి నాయకుల పాలనతో దేశం వర్ధిల్లాలని కోరుకున్నారు.
-
వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్