ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ బి.వి.బంగార్రాజు గారి శతక పద్యాల పటన పోటీ లు ఆసక్తిదాయకంగా సాగాయి. అనకాపల్లిలోని హోటల్ విజయా రెసిడెన్సీ లో ఆదివారం ఉదయం 9 గంటలనుండి రాత్రి 7 గంటలవరకు నిర్వహింపబడిన ఈ పోటీలకు విద్యార్థినీ విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది.అనకాపల్లిలోని వివిధ విద్యా సంస్థ లే గాక చుట్టు పక్కల మండల కేంద్రాల పరిధిలోని గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థినీ విద్యార్థులు కూడా ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.50 విద్యా సంస్థ లనుంచి, సుమారు 500 మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొన్నారు.
జూనియర్స్ (ఐదు,ఆరు,ఏడు తరగతులు) విభాగంలో కె.అన్నపూర్ణ( మామిడిపాలెం జెడ్.పి.స్కూల్ ), ఎం.హిమాంజలి (డి.ఎ.వి.పబ్లిక్ స్కూల్ , అనకాపల్లి ),కె.కోమలి(శ్రీ చాణుక్య ఇ-టెక్నో,అనకాపల్లి )వారు ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. సీనియర్స్ (ఎనిమిది,తొమ్మిది,పది తరగతులు) విభాగంలో దాడి వినయ్ వెంకట్ (సీతానగరం జెడ్.పి.హైస్కూల్ ) , జి.శ్యామల (వెదురుపర్తి,జెడ్.పి.హైస్కూల్), ఎం.సౌమ్య(పెనుగోల్లు ధర్మవరం,జెడ్.పి.హైస్కూల్) ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులను గెలుచుకున్నారు. ప్రతి విభాగంలోనూ ప్రథమ బహుమతిగా 1 ,500 రూపాయలు , ద్వితీయ బహుమతిగా 1 ,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 750 రూపాయలు నగదు,బంగార్రాజు గారు రచించిన శతకాలను అందజేశారు. ఈ పోటీలలో పాల్గొన్నవారందరికీ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్.పద్మజాగారు పెన్సిల్ బాక్స్ లు బహుకరించారు. పద్యం చదవడంలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన 100 మందికి ప్రశంసా పత్రాలను నిర్వాహకులు అందించడం జరిగింది. శ్రీయుతులు వేపా పార్వతీశం,భమిడిపాటి ప్రసాదరావు, కొప్పిశెట్టి సూర్యనారాయణ లు ఈ పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభకు డా.తలతోటి పృథ్వి రాజ్ అధ్యక్షత వహించారు.
పృథ్విరాజ్ రూపొందించిన "బంగారు పద్యాలు "అనే వీడియో సీడిని మచిలీపట్నానికి చెందిన కవి, విమర్శకులు డా.రావి రంగారావు, "పద్యరాగాలు" ఆడియో సి.డి.ని రామా బాలానంద సంఘం అధ్యక్షులు శ్రీ బి.ఎస్.గుప్తా ఆవిష్కరించారు. "శ్రీ బి.బంగార్రాజు గారితో ఇంటర్వ్యూ " వీడియో సీడిని డా.ఐ.కె.రాజు,డా.పద్మజ దంపతులు సంయుక్తంగా ఆవిష్కరించారు. "శ్రీ బంగార్రాజు సాహితీ సాంస్కృతిక చాయా చిత్రాలు" వీడియో సి.డి.ని శ్రీ నండూరి రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం హైకూ క్లబ్ సభ్యులు కవి శ్రీ బి.వి.బంగార్రాజు గారిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ముఖ్య అతిథి డా.రావి రంగా రావు గారిని, గౌరవ అతిథి బి.ఎస్.గుప్తా గారిని,ఆత్మీయ అతిథులు డా.ఐ.కె.రాజు దంపతులను మరియు శ్రీ నండూరి రామకృష్ణలను, క్లబ్ ప్రధాన కార్య దర్శి శ్రీ జి.రంగబాబు, ఉపాధ్యక్షులు గట్టి బ్రహ్మాజీ, శ్రీమతి సిహెచ్ లక్ష్మీ సాహితీ శిరీష లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్స్ కు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడంలో సహకరించిన ప్రతిఒక్కరికి హైకూ క్లబ్ అధ్యక్షులు డా,తలతోటి పృథ్వి రాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments:
Post a Comment