పద్య ప్రక్రియ ప్రాచీనమైనదైనా బంగార్రాజు స్వీకరించిన కవితా వస్తువులు ఆధునికం...వైవిధ్యమైనవి కూడా. సంప్రదాయ కవితా రచనా విధానాన్ని అనుసరించి బంగార్రాజు గారు తన రెండు శతకాలను శ్రీకారంతోనే మొదలుపెట్టారు. ఇష్ట దైవ స్తోత్రం తో కూడిన శ్రీకార పద్యాల తర్వాత ఇలలో దైవమైన "అమ్మ" పదం ప్రారంభంతోనే రెండు శతకాలలో పద్యాల్ని రాశారు. ఈ లోకంలో కనిపించే దైవం...మనలను కని పెంచే దైవం "అమ్మ". మానవులమైన మనలను సృష్టించింది బ్రహ్మో,,,కాదో ఉహా జనితమైన ఆలోచన! మన మత విశ్వాసం!!. కాని మనకు జన్మనిచ్చి అందమైన ఈ లోకాన్ని చూసేందుకు మూలం...సృష్టి కర్త "అమ్మే". ఆమే మన జన్మకు "బ్రహ్మ" అందుకే~
" అమ్మను మించిన దైవము
ఇమ్మహి లేదదియె నిజము ఏమర కెపుడున్
బమ్మయ్య ఏమి చేసెనొ
అమ్మేగా నిన్ను కన్న దవనిని మౌనీ! " అని కీర్తించారు తన చిన్ననాడే తల్లిని కోల్పోయి తల్లి ప్రేమకు దూరమైనా బంగార్రాజు.
ఈ లోకంలో మనం కొందరిని, కొన్నింటిని పరమ పవిత్రమైనవిగా, గౌరవ నీయమైనవిగా, ప్రత్యేకమైనవిగా భావిస్తాము. మన జన్మకు ఆధ్యుడైన" తండ్రి", దైవంతో సమానమైన "గురువు", కోవెలలాంటి "బడి" పూజ్యనీయుడు "అతిథి" అని చెబుతూ ఆది దేవతగా "అమ్మ"ను భావించాలని
" 'అమ్మ' జన్మనిచ్చి యాది దేవతయయ్యే,
'అయ్య'కూడ జన్మ కాద్యుడయ్యె,
'గురువు' దైవ మయ్యె కోవెల బడియయ్యె
'అతిథి' పూజనీయుడయ్యె; చైతు! " అని కవి శ్రీ బంగార్రాజు అంటారు. వీటన్నింటిలోకెల్లా ప్రతి ఒక్కరు మొదట గౌరవించాల్సిన మహోన్నతమైన వారు "తల్లిదండ్రులు". అందుకే~
" అమ్మ-నాన్నకన్ననారాధ్యు లెవరయ్య?
ఉపిరుండు వరకు కాపుకాచి,
నీదు వృద్ధి కొరకు నిరతమ్ము తపియించు,
త్యాగ శీలురయ్య; తలపు; చైతు! " అని అంటారు బంగార్రాజు.
మనం ప్రయోజకులైతే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మించి ఈ లోకంలో సంతోషించే వారు మరొకరు ఉండరు. అందుకే~
" కన్నవారి కలలు వన్నెలీనును గాదె
నిన్ను నీవు తెలిసి కొన్ననాడు;
కన్నవారి ఋణము కాసంత తీర్చిన,
ధన్యమగును జన్మ; తలపు చైతు! " అని కన్నవారి ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకోమని ఉద్భోదిస్తాడు కవి.
ఇవేకాదు, "మౌనీ రాగాలు" శతకము చివరిలో "అమ్మ పిలుపు" శీర్షికతో ఖండ పద్యాలను రాశారు. తల్లి లేనివారికే తల్లి విలువ తెలుస్తుంది అని అంటారు.ఇదు మాసాల వయసులోనే తల్లిని కోల్పోయినా, జన్మనిచ్చిన అమ్మ ప్రేమను చవిచూసే అదృష్టానికి నోచుకోక పొయినా, అమ్మమ్మ "వెంకట నరసమ్మ" ప్రేమాప్యాయతలతో ఇరవై సంవత్సరాలు ఎంతో ప్రేమతో శ్రీ బంగార్రాజు పెదిగి అమ్మ విలువను గ్రహించి ధన్యులయ్యారు. అందుకే తన "చైతన్య రాగాలు"శతకాన్ని తల్లికి, పెంచిన తల్లికి అంకితమిచ్చి ధన్యుడయ్యాడు.
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
No comments:
Post a Comment