పద్యకవి శ్రీ బి.వి. బంగార్రాజు తన శతక సాహిత్యంలో "ధ్యాన" మార్గము గూర్చి కొన్ని పద్యాలను రాశారు. మనిషిని చెడువైపునుంచి మంచి వైపుకు మళ్ళించే మహత్తరమైన సాధనంగా ద్యానాన్ని కవి పేర్కొన్నారు. ధ్యానం ఆరోగ్యానికే కాదు సుగుణాలను పొందడానికి కూడా ఒక మార్గం. శరీరంలో ఒక భాగం మనసు. అదికూడా ఒక మాంసపు ముద్దే అని భావించవద్దని కవి అంటారు. మనసు కోతిలా చంచలత్వ లక్షణాలను కలదిగా పేర్కొంటారు. మనసు కుదురుగా ఉండనప్పుడు, దానిని నిర్లక్ష్యం చేస్తే పెను భూతమై మనల్ని మింగే ప్రమాదం కూడా ఉన్నది కనుక అట్టి స్థితినుంచి రక్షించ గలిగే ధ్యాన మార్గం గూర్చి కవి బంగార్రాజు ~
" మనసును మాంసపు ముద్దగ
అనుకొన్నను కుదరదమ్మ అది కోతి సుమా!
పెనుభూతము కాకుండగ
మనవైపుకు తెచ్చు "ధ్యాన"మార్గము మౌనీ! " అని ధ్యాన మార్గాన్ని సూచిస్తారు .
మనసులో ఏర్పడే దుఖాన్ని పోగొట్టే మందు గూర్చి ~
" మనమున కలిగెడు దుఃఖము
క్షణమున పోగొట్టు మందు కనుగొనె గురువుల్
కనగానదియే 'వర' మీ
జనకోటికి "ధ్యాన" యోగ సాధన మౌనీ! " అని దుఃఖ బాధను అనుభవించే జీవకోటికి వరమన్నట్లు, దుఖానికి విరుగుడైన మందు అన్నట్లు "ధ్యానాన్ని" కవి పేర్కొన్నారు.
ధ్యానం చెయ్యడం వల్ల దుఖం పోవడమే కాదు, చంచల స్వభావాన్ని మనిషినుంచి దూరం చెయ్యడమే కాదు, జ్ఞానాన్ని పెంపొందించు కోవచ్చని ఇలా కవి బంగార్రాజు చెబుతారు.
" ధ్యానము సాధన చేయగ
మానస మందమరు 'స్థిరత' మంచియె నిలచున్;
జ్ఞానము పెంపొందెడు న
ద్దానిని నిత్యమ్ము సలుప ధన్యవు మౌనీ! "
ఈ రీతిగా కవి బంగార్రాజు గారి శతకాలలో ధ్యాన స్థితి ద్వారా మనిషి పొందగలిగే ప్రయోజనాలను కూడా ఉపదేశాత్మకగా చెప్పారు. బంగార్రాజు గారి ఆరోగ్య రహస్యాలలో వారు అనుదినం అనుసరించే ఈ "ధ్యానం" కూడా ఒకటి.
No comments:
Post a Comment