ఈ అనంతకోటి ప్రపంచంలోనుంచి మానవ జాతి సమూహాలుగా విడిపోయి తెగలుగా,జాతులుగా, మతాలుగా ,కులాలుగా ఏర్పడి సంఘజీవులుగా బ్రతుకుతున్నారు. మనిషి ఏర్పరుచుకున్న కులమతాల పునాదులపై ఆచార వ్యవహారాలూ రూపుతొడిగాయి. నేడు మానవ జాతిని కబళిస్తున్న ధనముకంటే భయంకరమైనది మతము లేదా కులం. మనుషులు మతాలుగా కులాలుగా విడిపోయారు. కవి బంగార్రాజు కులతత్వం,మత తత్వం లేని సమాజాన్ని కాంక్షిస్తూ అనేక పద్యాలను వారి శతకాలలో రాశారు.
కొందరు తమ స్వప్రయోజనాల కొరకు కుల తత్వాన్ని, మతతత్వాన్ని రెచ్చగొట్టే విద్వేషాలకు కొందరు మూర్ఖులు ఉపయోగిస్తున్నారు. అటువంటి వారి చర్యలను నిరశిస్తూ ~
" 'మతపిచ్చి'యు, 'కుల పిచ్చి'యు
వెతలను కలిగించె నేడు విపరీతముగా;
గత చరిత మెరిగి కూడా
'కుతికల'వరకెందు కింత క్రోధము మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని అంటారు.పరమతంపై క్రోధాన్ని విడనాడి పరమత సహనాన్ని కలిగి ఉందా;అని ప్రభోదించారు కవి బంగార్రాజు. అంతే కాదు ~
" ద్వేషింపకు పరమతమును,
దూషింపకు కులము పేర దుష్టుం డైనన్,
వేషాలకు విలువివ్వకు,
రోషావేశాల కెపుడు లొంగకు మౌనీ! " అని మతపరమైన రోషావేశాలకు పోకుండ మత సహనాన్ని కలిగి ఉండాలని కోరారు కవి.
ముస్లిం,హిందూ,క్రైస్తవం. మతమేదైనా ఆయామతంలో దేవుళ్ళుగా,ప్రవక్తలుగా పూజింప బడేవారు వారందరూ కరుణామయులే! ఏ ఒక్కరు హింసను అనుసరించమని చెప్పలేదు. అన్ని మతాల పరమార్థం ఒకటేనని గ్రహించని కొందరు వెర్రివాళ్ళు కరుణ, కనికరం లేకుండా మతం పేరుతో మరణ హోమాన్ని సృష్టిస్తున్నారు. ఇవి గమనిచే కవి బంగార్రాజు ~
" 'అల్లా' 'రాముడు' 'జీససు'
కల్లా కపటములు లేని కరుణామయులే;
ఎల్లరి మూలం బొకటని
వెల్లడియగు, తెలియ లేరె? వెర్రా! మౌనీ! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అని జనాలలోని మతమనే వెర్రి పోవాలని ఆకామ్క్షిస్తాడు కవి బంగార్రాజు.
మనుషుల మధ్య పగను రగిలించే మత మౌడ్యాన్నికవి ప్రస్తావిస్తూ
" మతము లందు కలదు మౌడ్యమ్ము కొంతైన
ఇతర మతములన్న నేవగింపు;
భక్త జనులకెల్ల పగ రగిలించుచు,
పరుల జంపు మనుచు పనుచు; చైతు! " అని అంటారు.
మతమే వినాశానకరమైనదని అనుకుంటే...దానిలోనుంచి పుట్టి, దానికి అనుబంధంగా అన్నట్లు భయోత్పాతం, విద్వంసాల్ని సృష్టించే శక్తులుగా ఏర్పడ్డవి మత విశ్వాసాలు,ఉగ్రవాదం. మత చాందసం, మూఢ నమ్మకాలు సమాజ పురోభివృద్ధికి ఆటంకాలని గ్రహించమని కవి బంగార్రాజు కోరుతూ ~
"మూఢ నమ్మకములు, మూర్ఖపు ధోరణుల్
ప్రగతి కడ్డమైన బంధనములు;
మధ్య యుగపు నాటి మత చాందసమ్ములు
మనకు వలదు; నేడు వినర, చైతు! " అని అంటారు.
మత మౌడ్యం, మూడ నమ్మకాలు వెర్రితలలు వేసిన భూభాగం ఈదేశం. సతీసహగమనం పేరుతో సజీవంగా ఉన్న స్త్రీని అగ్నికి ఆహుతి చేసిన ఒకప్పటి హేయమైన మత దురాగతాలను ప్రస్తావిస్తూ ~
" పతి చనిపోయిన యంతట
'సతి' పేరిట మగువకూడ చావదె మునుపున్;
అతి హేయమైన పద్ధతి
'పతి భక్తి'కి వెర్రితలలు భావ్యమె మౌనీ!" అని అంటారు.
మతంలోనుంచి పుట్టిన మరో వినాశనకారి ఉగ్రవాదం. పవిత్ర యుద్ధం పేరుతో, మత తత్వం పేరుతో సాగించే మారణ హోమాల్ని ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నాము. ఏ మతమూ ఉన్మాదంగా ఉగ్రవాదంతో మారణ హోమాన్ని సృష్టించమని చెప్పలేదు. తుఫానులు,భూకంపాలు రూపాలలో ప్రకృతి కలుగజేసే వినాశానాలకు మానవాళి బలికావడం చూస్తున్నాము. ఇవి చాలవన్నట్లు ఉగ్రవాదం కూడనా?! అని ~
" సృష్టి చేయుచున్న శిక్షలు చాలవా?
ఉగ్రవాదమేల? ఉద్యమమ్ము?
భయపు టంచు లందు ప్రజనుంచు క్రూరత్వ
మే, మతమును నేర్పదిలను చైతు! " (వీడియోకై క్లిక్ చెయ్యండి) అంటాడు.
కొందరు తాము విశ్వసించే మతమే గొప్పదని, తాము విశ్వసించే దేవుడే గొప్పవాడని అనుకుంటారు. అంతవరకైతే ఫర్వాలేదు. కాని కొందరు ఎదుటివారి మతాన్ని,దేవుడిని తక్కువచేసి తూలనాడే విధానాన్ని కవి నిరసిస్తూ ~
" నా దేవుడు గొప్పంచును,
కొందరు తాము విశ్వసించే మతమే గొప్పదని, తాము విశ్వసించే దేవుడే గొప్పవాడని అనుకుంటారు. అంతవరకైతే ఫర్వాలేదు. కాని కొందరు ఎదుటివారి మతాన్ని,దేవుడిని తక్కువచేసి తూలనాడే విధానాన్ని కవి నిరసిస్తూ ~
" నా దేవుడు గొప్పంచును,
నీ దేవుడు తక్కువంచు నిందించుట యీ
భూదేవికి జన్మించిన
సోదరులకు తెలివిలేమి చోద్యము మౌనీ! " అని అంటారు.
అంతేకాదు."మతమంటే..." శీర్షికతో ఖండ పద్యాలను "చైతన్య రాగాలు" శతకంలో బంగార్రాజు రాశారు. ఈ విధంగా శ్రీ బంగార్రాజు దేశాన్ని పట్టి పీడిస్తున్న మతతత్వాన్ని, కులతత్వాన్ని నిరశిస్తూ మతం పునాదులపై పుట్టిన ఉగ్రవాదాన్ని,మూఢ విశ్వాసాలను ఈ సమాజంలోనుంచి పారదోలాలనే తలంపుతో తన రెండు శతకాలలో కొన్ని అద్భుతమైన పద్యాలను రాశారు. ఈ పద్యాలను బట్టి మతైక్యతే బంగార్రాజు గారి అభిమతమని చెప్పవచ్చు.
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
No comments:
Post a Comment