మనిషి మాటకు,నడవడికకు, ఉన్నత మానవ లక్షణాలకు మూలమైనది మనసు. మనసు మల్లెపువ్వు లాంటిది. మంచి అనే పాదిని చేసి విచక్షణ అనే నీరు పోస్తూ పెంచితే విజ్ఞానంతో వికసించి పరిమళిస్తుంది మల్లెలా మనసు. లోకంలో జరిగే అనేక దుర్మార్గాలకు, అరాచకాలకు కారకులైన వారి మనః ప్రవృత్తే వీటన్నింటికి కారణం. అందరూ మంచి మనసుకలిగి అందరూ ఆనందంగా ఉండాలన్నదే బంగార్రాజుగారి ఆలోచన.తెలుగు సినిమా పాటల్లో "మనసు"ను అనేక కోణాల్లో నిర్వచించి, వివరించి "మనసుకవి"గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కవి ఆచార్య ఆత్రేయ. ఆత్రేయ గారి మాదిరిగానే మనసుతత్త్వాన్ని పసిగట్టిన బంగార్రాజు గారు
"అదిమి పెట్ట నెంచ నటకెక్కి కూర్చుండు
బుజ్జగించు కొలది బుసలు కొట్టు;
లెక్క చేయకున్నచక్కగా దరిజేరు,
మనసు, చంచలమ్ము వినవె; చైతు! " అని చంచలమైన మనసును గూర్చి చెప్పి, అలాంటి చంచల మనసుపట్ల అందరూ జాగ్రత్త వహిస్తూ స్థిమిత గుణాన్ని,స్థిరమైన మనసునుగా మన మనసును మలుచుకోడానికి కవి పై పద్యాని రాశారు.
చంచాలమనసును స్థిరమైన...స్థిమితమైన మనసుగా మార్చుకోడానికి అనేకులు ఆయామార్గాలను అనుసరిస్తారు. కొందరు ధ్యానం చేస్తుంటారు. మరికొందరు దైవ ప్రార్థన చేస్తుంటారు. ఎన్ని చేసిన అంతిమ ప్రయోజనం, లక్ష్యం ఏమై ఉండాలంటే పిచ్చి ఆలోచనలకు అనుగుణంగా కాక మంచి వైపు మనిషిని నడిపించ గలిగే స్థిరమైన మనసును పొందాలని
"ధ్యానమైన గాని, దైవ ప్రార్థన గాని,
మనసు మంచి వైపు మరలు కొరకె;
పిచ్చి ఊహలందు విహరింప బోకుండ
స్థిరత కలుగ చేయు వరము; చైతు!" అని అంటారు.
మురికంటకుండా వస్త్రాలను ఎలా కాపాడుకుంటామో...మనసునుకూడా అలా రక్షించుకోవాలి!.మనసు మంచిదైన వారికి లోకంలో అంత మంచే కనిపిస్తుంది. చెడ్డవారికి చెడ్డగానే కనిపిస్తుంది. దృష్టి కోణాన్ని బట్టి లోకాన్ని కనిపిస్తుంది, అర్థం చేసుకుంటారు. మలినం లేని మనసు ఆ మనిషిని మంచివైపు మహోన్నత శిఖరాలవైపు నడిపిస్తుంది. కనుక
"మనసు మంచిదైన మంచి యే కనిపించు;
మలినమైన మనసు తెలివి దప్పు;
తెలివి కలుగ మనసు మలినమ్ము తొలగును;
మంచి వైపు తాను మళ్ళు; చైతు! " అని అంటారు.
ఆరోగ్య విషయంలో శారీరక వ్యాయామంతో జాగ్రత పడేకంటే ముఖ్యంగా మనసును నిర్మలంగా ఉంచుకుంటేనే ఆరోగ్యం చక్కగా ఉంటుందని గ్రహించాలి.మనసుకు మలినం అంటకుండా పవిత్రంగా ఉంచుకుంటే ఎదుటివారి గుణము ఎలాఉన్నా మన మనసు మంచిగా ఉంటుందని ~
" మనసు పొరలలోన మర్మమ్ము లేకుండ
మసలి చూడు నీకు మంచి జరుగు;
ఎదుటి వాని గుణము దెట్లుండగానిమ్ము ,
నీదు మదిని మంచి నిలుపు ; చైతు! " అని అంటారు.
గుణగణాలు మనసుపై ప్రభావాన్ని చూపుతాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. మంచి గుణాలు మంచి ప్రభావాన్ని, దుర్గుణాలు దుష్ప్రభావాన్ని మనసుపై కలిగిస్తాయి. శాంత గుణం ప్రతిఒక్కరు అలవార్చుకోవాల్సిన గుణం. ఇటువంటి గుణాలు అలవరచుకోవాలని కవి ~
" శాంత పడిన మనసు స్పందించు చక్కగా
వెలితి పడ్డ మనసు కలత జెందు;
తొట్రు పాటులోన దొర్లులే తప్పులు;
స్థిరత కలిగి పనులు చేయు: చైతు! " అని అంటారు.
ఈ విధంగా కవి బంగార్రాజు తన శతకాలలో మనసు లక్షణాలను, మనస్తత్వాన్ని వివరించి మంచి మనసు అందరూ కలిగుందాలని ప్రబోధించారు బంగారు మనసు బంగార్రాజు.
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
No comments:
Post a Comment