లలితమైన పదాలతో నీతి పద్యాలను ప్రకటించడమే కాదు, ప్రజల నర నరాల్లో జీర్ణించుకుపోయిన మూఢ నమ్మకాలను సైతం నిర్భయంగా వ్యతిరేకించిన హేతువాది వేమన. అదే స్థాయిలో అభినవ వేమనలాగా తన శతకాలలోనూ నీతిదాయకమైన పద్యాలను ప్రకటించడమే కాకుండా కొన్ని పద్యాలలో తన హేతువాద దృక్పథాన్ని కూడా చాటారు శ్రీ బి.వి.బంగార్రాజు. బంగార్రాజు గారు తన హేతువాద దృక్పథంతో కూడిన పద్యాలతో మూఢ విశ్వాసాలతో కూరుకుపోయిన జనాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నించారని చెప్పుకోవచ్చు.
ఈ లోకంలో చాలామందికి వారి శక్తి యుక్తుల మీదకంటే అతీంద్రియ శక్తులపైనే విశ్వాసం ఎక్కువ.మనం మన నేత్రాలతో చూడని దైవం,దెయ్యం లపై నమ్మకం ,విశ్వాసం,భయం! మనం అనుభవించే సుఖ-దు:ఖాలకు కారకులం మనమేకాని ఇతరులు కాదనే సత్యాన్ని గ్రహించామంటూ...
" నీవే దైవము దయ్యము
నీవే సుఖ దుఖములకు నెలవై నిలువన్,
భావించ నేల నితరులు
జీవిత విద్రోహులనుచు సిగ్గది మౌనీ! " అని ఉద్భోదిస్తారు.
చాలామంది కర్మని నమ్ముకొని కష్ట పడరుగాని, కర్మ సిద్ధాంతాలను గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఏదైనా కష్టం సంభవిస్తే ఇది నా తలరాత, ఇది నా పూర్వ జన్మ కర్మ ఫలితం అంటూ మూర్ఖంగా శోకాలు తీస్తుంటారు. ఈ సృష్టిలో కదలక మెదలక మౌనంగా ఉంటే ఏ ఎ విషయం లోనూ ప్రయోజనం,ఫలితం కలుగదు అని ఆలోచించమంటారు కవి బంగార్రాజు గారు ఇలా..
" నుదుటను బ్రహ్మయరాతని,
ఇది పూర్వపు కర్మయంచు నేడ్చుట యెల్లన్
వదలని మూర్ఖత్వం బిది
కదలక కూర్చున్న ఫలము కలుగునె మౌనీ! " అని అంటారు.
ప్రపంచం శాస్త్ర, సాంకేతికంగా పరుగులు తీస్తున్నా మన దేశంలో చాలామంది మూఢ విశ్వాసాల చుట్టే తిరుగుతున్నారు. పెళ్లి అయి చాలా సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టక పోవడానికి కారణాలను గ్రహించక గుళ్ళూ ,గోపురాల చుట్టూ ప్రదక్షణలు,వ్రతాలు చేస్తుంటారు.మొక్కులు మొక్కుతుంటారు.రావిచెట్టుకు రక్షరేకులు కడుతుంటారు. ఇవేవి సమస్యను పరిష్కరించవు , లోపాన్ని సవరించవని గ్రహించరు. మంచి డాక్టర్ ను కలిస్తే లోపాన్ని తెలియ జేసి పిల్లలు కలిగే మార్గాన్ని సూచిస్తాడని ఆలోచించరు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొనే బంగార్రాజు గారు ~
" గుడుల చుట్టు తిరిగి, గుంజీలు తీసిన
కడుపు పండు మాట కల్ల గాదె?
రావి చెట్టు కాదు, రక్ష రేకులు కాదు,
లోప మెరుగ కలుగు పాప; చైతు!" అని అంటారు.
"కష్టే ఫలి " అంటారు. శ్రమపడకుండా ఫలం రాలేదని చింతిస్తే ప్రయోజనం లేదు. చాలామంది "నారుపోసినవారు నీరుపోయడా" అని భగవంతునిపై భారంవేసి సోమరులై బతుకు వెళ్ళ దీస్తారు తప్పించి కస్టపడి పనిచేసి బ్రతుకుదామని అనుకోరు. అందుకే హేతువాద దృక్పథంతో ~
" పనిని చేయ కుండ ఫలము రాలేదంచు
నెత్తి బాదుకొన్న నెత్తురోడు;
'నారు పోసినయ్య నీరు పోయడె ' యన,
తెలివి తక్కువగును తెలియు; చైతు! " అని అంటాడు కవి బి.వి. బంగార్రాజు.
మూఢ విశ్వాసాలపట్ల భారతీయులకున్నంత నమ్మకం మరే ఇతర దేశీయులకు లేదని అనడం అతిశయోక్తి కాదేమో! అంతేకాదు... దేవునిపేర జంతుబలులు ఇచ్చి ఆ మాంసాన్ని కడుపునిండా ఆరగిస్తారు. గుప్త నిధులకోసం బలులిచ్చే వైనాన్ని గమనించవచ్చు. జ్ఞానం లేకుండా ఇటువంటి హేయమైన మూడ విశ్వాసాలను కవి బంగార్రాజు నిరశిస్తూ ~
" పదవి, ధనము కొఱకు బలులిత్తుమని మ్రొక్కి
నరుల జంతువులను నరుకు వారు
మూఢ నమ్మకముల మోహమ్ము లోపడి,
జ్ఞాన శూన్యులైన జాతి; చైతు! " అని అంటారు.
ప్రజల మూఢ విశ్వాసాలలో విచిత్రమైనది, నేటి రాకెట్ యుగంలోకూడా బలీయంగా, గుడ్డిగా ఈ దేశ ప్రజలు విశ్వసించే అంశం వాస్తు. ప్రతివిషయాన్ని వాస్తుకు ముడిపెట్టి గుడ్డిగా అనుసరిస్తే అనర్థాలకు దారితీస్తుంది అని కవి హెచ్చరిస్తూ ~
" వాస్తు బాగు బాగు భయ మేమి నాకంచు
కడుపు నిండ మెక్కి కదల కున్న
ఒళ్ళు గుల్ల యౌను; ఇల్లేమి కాచురా
రోగములకు వెరచి సాగు: చైతు! " అని హేతువాద దృక్పథాన్ని కవి ప్రదర్శించారు.
ఈ రకంగా మన నమ్మకాలు, సంప్రదాయ - ఆచార వ్యవహారాలలోని లోపాల్ని సైతం విమర్శించడానికి కూడా వెనుకాడని హేతువాది బంగార్రాజు.
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
No comments:
Post a Comment