తెలుగు సాహిత్యంలో శాఖోప శాఖలుగా వికాసము పొందిన కావ్య ప్రక్రియల్లో శతకము ఒకటి. అందులోనూ తెలుగు సంప్రదాయ కవితా రూపాల్లో శతక సాహిత్యానికి ఒక విశిష్ట స్థానం ఉంది. శతక ప్రక్రియల్లో ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉంటుంది.ఒకో పద్యాన్ని ఒకో వస్తువుతో నీతి దాయకంగా రాసే అవకాశం శతక ప్రక్రియలో ఉంది. బంగార్రాజు గారి శతక పద్యాలలో ఎంతో వస్తు వైవిధ్యం ఉంది. ఆధునికమైన వస్తువులను తన కవితా వస్తువులుగా తీసుకొని భావాన్ని చాలా సరళంగా చెప్పారని గమనించవచ్చు.
శ్రమని నమ్ముకొని పనిచేసేవారే జీవితంలో మంచి ఫలితాలను సాధిస్తారని కవి అంటాడు. పనిపట్ల మనసును లగ్నం చేసినవాడే, పనిని దైవంగా భావించేవాడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని
" పనియే దైవం బిలలో
పనిచేయుట పూజయగును పరమాత్మునకున్ ;
ఘనులందరు పనిలోనే
మనసును లగ్నమ్ము చేసి మనెదరు మౌనీ! " అని అంటారు.
జ్ఞాని యైనవాడు తన జీవితానికి,తద్వారా సమాజానికి ఉపయోగపడే పని చేస్తూ బ్రతకాలి. ప్రతి మనిషికి ఎప్పుడోకప్పుడు మరణం తప్పదు.ఎవడు ఎప్పుడు పనిచెయ్యక సోమరిగా ఉంటాడో వాడు ఆ ఆ క్షణమే మరణించిన వాడితో సమానం! అందుకే ~
" మనిషి మరణము తథ్యము;
పనిచేయుచు నుండవలయు బ్రతికిన నాళ్లన్
పనిమానుట యన మరణము
కనుకనె మని మానతగదు జ్ఞానికి మౌనీ! " అని కవి శ్రీ బంగార్రాజు అంటాడు.
మనిషి ఆశా జీవి . ఆశే ఆక్సిజన్ గా మనుషులు బ్రతుకుతుంటారు. ఆశ ఉండాలిగాని అత్యాశ ఉండకూడదు.పని చెయ్యలిగాని శక్తికి మించిన పని చెయ్య కూడదు. అలా చేస్తే ఒకో సారి అనర్థాలకు దారితీస్తుంది. ఈ సూక్ష్మమైన వ్యత్యాసాన్ని గమనించి, సత్యాన్ని గ్రహించి ప్రతిఒక్కరు జీవించాలని కవి బంగార్రాజు కోరుకుంటూ~
" ఆశతోడనుండు టవనిలో సహజమ్ము;
అతిగ నాశపడిన బ్రతుకు చెడును;
శక్తి నరసి పనుల జరుపుట ధర్మమ్ము
మోయలేని పనికి పోకు; చైతు! " అని అంటారు.
"మానవ సేవే మాధవ సేవ" అని నానుడి. ఇతరులకు సేవ చెయ్యడము సాక్షాత్తు ఆ భగవంతుడ్ని పూజించడంతో సమానం. కనుకనే పరుల సేవలో మనలను తరించమంటూ~
" పరులకు సేవలు చేయుట,
పరమాత్ముని పూజయగును పరికింపంగా;
కరుణామయు లీ మాటనె
తరియింపగ చెప్పినారు తలపుము మౌనీ! " అని ఉపదేశిస్తారు కవి శ్రీ బంగార్రాజు.
"పెద్దవారి మాట చద్ది మూట" అని సామెత. కాని ఇప్పుడు ఈ లోకంలో ఎంతమంది పెద్దవారి మాటలకు విలువిస్తున్నారు? హద్దులు, ఎల్లలు లేని జీవితాన్ని కోరుకునే నేటి యువతకు స్వేచ్ఛ ఎక్కువైనా చెడిపోతారని
" పెద్ద వారి మాట చద్ది మూట" యనిరి;
పెద్దలన్న నిపుడు పెదవి విరుపు;
హద్దులన్న వారి కది యిష్ట ముండదే!
స్వేచ్ఛ యెక్కువైన చెడుటె; చైతు! " అని అంటాడు కవి శ్రీ బంగార్రాజు.
ఈ విధంగా బంగార్రాజు గారు తన రెండు శతకాలలో చాలా నీతి పద్యాలను సరళ శైలిలో చెప్పారు.రాజుగారి పద్యాలను గమనిస్తే నీతి కోవిదులు బంగార్రాజు అని చెప్పుకోవచ్చు.
- వ్యాసరచయిత: డా.తలతోటి పృథ్విరాజ్
No comments:
Post a Comment